న్యూఢిల్లీ : ఆస్తుల నగదీకరణ కార్యక్రమాన్ని (ఏఎంపీ) వేగవంతం చేయాలని వివిధ మంత్రిత్వ శాఖలను నీతి ఆయోగ్ కోరింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఈ కార్యక్రమం ద్వారా రూ 88,190 కోట్లను సమీకరించాలనే లక్ష్యం దిశగా నీతి ఆయోగ్ మంత్రిత్వ శాఖలను అప్రమత్తం చేసింది. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వివిధ మంత్రిత్వ శాఖల సన్నాహాలను క్యాబినెట్ కార్యదర్శి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వ ఆస్తులను కేంద్రం తెగనమ్ముతోందని విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో నగదీకరణ జరిపే ఆస్తులన్నింటిపై యాజమాన్య హక్కులు కేంద్రం వద్దే ఉంటాయని, ప్రభుత్వం వీటిని విక్రయించడం లేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆస్తుల నగదీకరణ లక్ష్యానికి చేరువయ్యామని, ఈ దిశగా పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళుతున్నామని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
రహదారులు, విద్యుత్ మంత్రిత్వ శాఖలు లక్ష్యానికి చేరువవుతుండగా, రైల్వేలు, మైనింగ్, పెట్రోలియం, క్రీడా మంత్రిత్వ శాఖలు ఆస్తుల నగదీకరణ లక్ష్యానికి ఇంకా దూరంలో ఉన్నాయని తెలిపాయి. గెయిల్, స్టేడియంలు, గోదాములు, ఇతర ఆస్తుల నగదీకరణపై అధికారులు దృష్టి సారించారు.
ఢిల్లీలోని అశోకా హోటల్ నిర్వహణను ప్రైవేటీకరించేందుకు టూరిజం మంత్రిత్వ శాఖ సన్నాహాలు ముమ్మరం చేసింది. 2021-22 బడ్జెట్లో వచ్చే నాలుగేండ్లలో రూ 6 లక్షల కోట్ల విలువైన ఆస్తులను నగదీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించిన సంగతి తెలిసిందే.