న్యూఢిల్లీ, అక్టోబర్ 28 : విధానపరమైన నిర్ణయాల్లో వేగం పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక ఏ ఫైలూ నాలుగు కంటే ఎక్కువ చేతులు మారకూడదని, ఆలోపే దానిపై నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించింది. ఇది వచ్చే నెల నుంచి అమలులోకి రానున్నదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సంస్కరణను తెచ్చేందుకు ఆరేండ్లుగా మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని, ఇప్పటికి సాధ్యమైందని పేర్కొన్నాయి. ఇన్నాళ్లూ ఒక్కో ఫైలుకు 6-7, ఒక్కోసారి 10-12 అంచెల్లో ఆమోదం అవసరమవుతున్నదని తెలిపాయి. ఈ జాప్యాన్ని తగ్గించేందుకు ఆరేండ్లలో ప్రభుత్వం అధికారులతో 300కు పైగా సమావేశాలు నిర్వహించిందని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వం ఇటీవల ‘ఈ-ఆఫీస్ 7.0’ వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వల్ల శాఖల మధ్య ఫైల్స్ బదిలీ వేగవంతం అవుతుంది.