న్యూఢిల్లీ, ఆగస్టు 12: 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ హామీ వట్టిదేనని మరోసారి నిరూపితమైంది. లక్ష్యంగా పెట్టుకున్న 2022 గడిచిపోయి ఏడాది కావస్తున్నా.. ఆ హామీ అమలుకు నోచుకోలేదు. హామీల అమలులో విఫలమైన బీజేపీ సర్కార్ దాటవేత ధోరణిని అవలంబిస్తున్నది. దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు అయిందా? లేదా? అనే అంశంపై స్పష్టత ఇవ్వని కేంద్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అమలు చేసిన పథకాలు విశేష ఫలితాలను ఇచ్చాయని చెప్పుకొచ్చింది.
ఈ మేరకు ఎంపీలు పీ సంతోష్ కుమార్, కుమార్ ఖేట్కర్ పార్లమెంట్లో ప్రశ్నించగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పొంతన లేని సమాధానమిచ్చి చేతులు దులుపుకొన్నారు. దేశంలో ‘రైతుల ఆదాయం రెట్టింపు’ అయిందా? ఒకవేళ కాకపోతే ప్రస్తుత పరిస్థితి ఏంటని ఎంపీలు ప్రశ్నించారు. దీనికి తోమర్ సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకొన్నారు.రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు గానూ ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు 18 పథకాలను అమలు చేశామని కేంద్ర మంత్రి తోమర్ తెలిపారు. ఈ పథకాల అమలుతో విశేష ఫలితాలు పొందామని పేర్కొన్నారు. వీటితో పాటు పంటలు, పశువుల ఉత్పాదకత పెరుగుదల, ఉత్పత్తి వ్యయం తగ్గింపు, పంట ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలు తదితర అంశాలను కమిటీ సూచించిందని పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ విడుదల చేసిన పుస్తకంలో రెట్టింపు ఆదాయాన్ని గడించిన 75 వేల మంది రైతుల వివరాలు పొందుపరిచినట్టు తెలిపారు.