NEET UG : నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్పై కేంద్ర ప్రభుత్వం అన్నివైపుల నుంచి విమర్శల్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో మళ్లీ జరగబోయే నీట్ యూజీ రీటెస్ట్ నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా వచ్చే నెలలో జరిగే పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రశ్నాపత్రాల తరలింపు కోసం ఏకంగా ఇండియన్ ఎయిర్ఫోర్స్నే దించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై గురువారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రధాన్, కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, ఎన్టీయే డైరెక్టర్ జనరల్ అభిషేస్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రశ్నాపత్రాల తరలింపుకు ఎయిర్ఫోర్స్కు చెందిన యుద్ధ విమానాల్ని వాడాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పేపర్ లీకేజీని అరికట్టేందుకు కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తోంది. రోడ్డు మార్గంలో పేపర్లను తరలిస్తే.. ఎక్కడో ఒక చోట పేపర్ లీకేజీ జరిగే అవకాశం ఉందనేది కేంద్రం అనుమానం. అందుకే సైన్యం రక్షణ మధ్య, ఎయిర్ఫోర్స్ విమానాల్లోనే వీటిని తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి పరీక్షా పత్రాల రూపకల్పన, ముద్రణ, రవాణా సహా అన్ని అంశాలను ప్రధాని కార్యాలయం నేరుగా పర్యవేక్షించనుంది.
నీట్ పరీక్ష కోసం ఎయిర్ఫోర్స్ను వాడే అంశంపై ప్రధాని మోదీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నీట్ యూజీ రీటెస్ట్ జూన్ 21న జరగనుంది. ఈ నెల 3న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం పరీక్షలో మాల్ప్రాక్టీస్ జరిగిందని మే 7న గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు మే 12న ఎన్టీయే ప్రకటించింది. మరోసారి 23 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంది.