న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా రుణాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ర్టాల అప్పులపై మాత్రం సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నది. ఇప్పుడు వాటిని మరింత కఠినతరం చేయాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ర్టాలతోపాటు అన్ని రాష్ర్టాల రుణ పరిమితిని జీఎస్డీపీలో 3.5 శాతానికి పరిమితం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇది 4 శాతంగా ఉన్నది.
కొత్త నిబంధన వచ్చే ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ అధికార ప్రతినిధిని సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. రాష్ర్టాల రుణాలపై ఆంక్షలు విధించడాన్ని పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. ‘మాంద్యం చుట్టుముడితే ఆదాయం పడిపోతుంది. ప్రజల అవసరాలను తీర్చేందుకు రాష్ర్టాలు మరింత వ్యయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకు రాష్ర్టాలు రుణాలు చేయక తప్పదు’ అని తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ అభిప్రాయపడ్డారు. జీఎస్టీ విధానంలోకి మారినందుకు రాష్ర్టాలకు చెల్లిస్తున్న పరిహారాన్ని కూడా కేంద్రం ఈ ఏడాది నుంచి నిలుపుదల చేసింది. ఏప్రిల్-నవంబర్ మధ్య రాష్ర్టాలు రూ.4లక్షల కోట్లు రుణాలు చేశాయి. కరోనాకు ముందు రాష్ర్టాల రుణపరిమితి ఆయా రాష్ర్టాల జీడీపీలో 3 శాతంగా ఉండేది. కరోనా నేపథ్యంలో దాన్ని 5 శాతానికి పెంచారు. అనంతరం దాన్ని కేంద్రం తగ్గించుకుంటూ వస్తున్నది.