న్యూఢిల్లీ, నవంబర్ 22: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(ఈసీ) నియామకాల అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి ఎలాంటి చట్టం లేకపోవడం.. రాజ్యాంగంలోనూ ఎలాంటి విధివిధానాలు రూపొందించకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుండటం ఆందోళనకర ధోరణి అని పేర్కొన్నది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రస్తుత వ్యవస్థ కంటే భిన్నమైన వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడింది. భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)తో కూడిన కమిటీతో నియామకాలు చేస్తే బాగుంటుందని పేర్కొన్నది. సీఈసీ నియామకానికి కొలీజియం వంటి వ్యవస్థను రూపొందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
టీఎన్ శేషన్ లాంటివారు రావాలి..
ఎలక్షన్ కమిషనర్ల నియామకాల గురించి చెప్పే రాజ్యాంగంలోని ఆర్టికల్ 324ను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. అటువంటి నియామకాలకు సంబంధించి ఇది ఎలాంటి విధానాన్ని రూపొందించలేదని తెలిపింది. అంతేకాకుండా పార్లమెంట్ ద్వారా చట్టం రూపొందించాలని రాజ్యాంగం భావించిందని, అయితే గత 72 ఏండ్లుగా ఇది జరుగలేదని పేర్కొన్నది. 2004 నుంచి ఏ చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) కూడా ఆరేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదని, 10 ఏండ్ల యూపీఏ పాలనలో ఆరుగురు సీఈసీలు మారారని, ఎనిమిదేండ్ల ఎన్డీయే పాలనలో ఏకంగా ఎనిమిది మంది సీఈసీలు వచ్చారని గుర్తుచేసింది. ఇది ఆందోళనకర ధోరణి అని పేర్కొన్న కోర్టు.. నియంత్రణకు రాజ్యాంగంలో ఎలాంటి నియంత్రణలు లేవని తెలిపింది. ఈ విధంగానే రాజ్యాంగ మౌనం దుర్వినియోగమవుతున్నదని పేర్కొన్నది. సీఈసీగా ‘ఉత్తమ వ్యక్తి’ ఎంపికయ్యేలా వ్యవస్థను ఏర్పాటు చేయడమే తమ ప్రయత్నమని, టీఎన్ శేషన్ లాంటి బలమైన సీఈసీ రావాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడింది. టీఎన్ శేషన్ 1990 నుంచి 1996 వరకు ఆరేండ్ల పాటు సీఈసీగా పనిచేశారు.