ఐటీ రూల్స్, 2021 సవరణలు చేస్తూ కేంద్రం డ్రాఫ్ట్ నోటిఫికేషన్
సామాజిక మాధ్యమాలను నియంత్రించేలా కీలక ప్రతిపాదనలు
మండిపడుతున్న సంస్థలు.. తమ రూల్స్కు అర్థం ఏమున్నదని ప్రశ్న
న్యూఢిల్లీ, జూన్ 8: సోషల్మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవడానికి కేంద్రంలోని మోదీ సర్కారు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గత ఏడాది తీసుకొచ్చిన ఐటీ రూల్స్కు సవరణలను ప్రతిపాదించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను సోమవారం రాత్రి విడుదల చేసింది. ఈ సవరణలపై 30 రోజుల్లో అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. తాజా సవరణల్లో మూడు కీలక ప్రతిపాదనలను కేంద్రం తీసుకొచ్చింది. మొదటి ప్రతిపాదనలో.. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులను సోషల్మీడియా సంస్థలు గౌరవించాలని సూచించింది.
రెండో ప్రతిపాదనలో.. ప్రభుత్వం తరుఫున కొత్త గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. సోషల్మీడియా సంస్థలకు చెందిన గ్రీవెన్స్ ఆఫీసర్లు తీసుకొనే నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం ఈ కమిటీకి ఉంటుందని వెల్లడించింది. మూడో ప్రతిపాదనలో.. యూజర్ల ఫిర్యాదుపై గ్రీవెన్స్ అధికారి 72 గంటల్లో (గతంలో 15 రోజులు) స్పందించాలని, అభ్యంతరకర కంటెంట్ను 72 గంటల్లో తొలగించాలని సూచించింది. తాజా సవరణలపై సోషల్మీడియా సంస్థలు గుర్రుగా ఉన్నాయి. తమ నిర్ణయాలను రద్దు చేసే అధికారం ప్రభుత్వ కమిటీకి ఇచ్చినట్లయితే తాము గ్రీవెన్స్ సెల్ను నడపటంలో, రూల్స్ ఏర్పాటు చేసుకోవడంలో అర్థమేమున్నదని ప్రశ్నిస్తున్నాయి. అభ్యంతరకరమైన సమాచారాన్ని 72 గంటల్లో తొలగించడం కష్టమని తెలిపాయి. గతవారం కూడా కేంద్రం సవరణలపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను ఇచ్చింది. విమర్శలు రావడంతో వెంటనే తొలగించింది.