న్యూఢిల్లీ, మార్చి 20: ఢిల్లీలో తమ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టవద్దని సోమవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం చెప్పిందని ఆయన తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం అడ్డుకోవడం భారతదేశ చరిత్రలోనే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఎందుకు కేంద్రం ఇలా చేసిందనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. కేంద్ర హోంశాఖ ఈ ఆదేశాలు ఇచ్చినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇందుకోసం మార్చి 17న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అరెస్టుకు ముందు వరకు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆర్థిక శాఖ బాధ్యతలు చూసేవారు. ఆయన రాజీనామా తర్వాత కైలాశ్ గెహ్లోట్ ఈ బాధ్యతలు తీసుకొని బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు.