న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా బుధవారం చోటు చేసుకున్న భద్రతాపరమైన లోపాలపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రైతులు వంతెన మార్గాన్ని నిర్బంధించి నిరసన తెలిపారు. దీంతో కారులో రోడ్డు మార్గంలో సభా స్థలానికి బయలుదేరిన ప్రధాని మోదీ సుమారు 20 నిమిషాలపాటు ఫ్లైవోవర్పై కారులోనే ఉండిపోయారు. అనంతరం వెనుతిరిగి ఎయిర్పోర్టుకు చేరిన ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య ఈ ఘటన మరింత వివాదాన్ని రాజేసింది.
మరోవైపు ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లలో జరిగిన తీవ్ర లోపాలపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. వీవీఐపీ తీవ్ర భద్రతా ప్రమాదానికి గురికావడానికి దారితీసిన లోపాలను పరిశీలించే ఈ కమిటీకి క్యాబినెట్ సెక్రటేరియట్ సెక్రటరీ (సెక్యూరిటీ) సుధీర్ కుమార్ సక్సేనా నేతృత్వం వహిస్తారని ప్రకటించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ బల్బీర్ సింగ్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) ఐజీ ఎస్ సురేష్ మరో ఇద్దరు సభ్యులని పేర్కొంది. నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని కమిటీకి సూచించినట్లు వెల్లడించింది.