MANIPUR| న్యూఢిల్లీ: మణిపూర్లో ఇద్దరు మహిళలను అల్లరి మూకలు నగ్నంగా ఊరేగించిన కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేసు విచారణను రాష్ట్రం వెలుపల నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అస్సాంలోని కోర్టు ఈ కేసు విచారణను చేపట్టే అవకాశముంది. మహిళల నగ్న ఊరేగింపును వీడియో తీసేందుకు ఉపయోగించిన మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో మీతీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు మహిళలను అల్లరిమూకలు నగ్నంగా ఊరేగించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పార్లమెంట్ను సైతం ఈ ఘటన కుదిపేసింది. పార్లమెంట్లో చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టాయి. మణిపూర్లో పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రతిపక్ష ఎంపీలు ఈ నెల 29, 30న ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు.