తిరువనంతపురం: వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను మార్చేందుకు చైనా ఏ ఏకపక్ష ప్రయత్నాన్ని కూడా భారత్ అనుమతించబోదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారత భూభాగంలోకి చైనా చొరబాట్లు పెరుగుతున్నాయని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్పై కేంద్రం అధికారిక వైఖరిని కోరుతూ విలేఖరులు అడిగిన ప్రశ్నకు మంగళవారం ఆయన సమాధానమిచ్చారు. ‘వాస్తవాధీన రేఖపై యథాతథ స్థితిని మార్చడానికి చైనా ఏకపక్ష ప్రయత్నమేమీ చేయకుండా చూసుకోవడంలో మేము చాలా స్పష్టంగా, చాలా ప్రభావవంతంగా ఉన్నాం’ అని జైశంకర్ తెలిపారు.
1962లో లడఖ్తో సహా భారతదేశంలోని పెద్ద ప్రాంతాలను చైనా ఆక్రమించుకోవడం వల్ల ఆ దేశంతో సరిహద్దుల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వీటిలో చాలా వ్యూహాత్మక ప్రాంతాలు భారత సరిహద్దు దళాలకు సవాలుగా ఉన్నాయని జైశంకర్ పేర్కొన్నారు. శ్రీలంక సంక్షోభంపై కూడా విదేశాంగ మంత్రి మాట్లాడారు. తన పొరుగు దేశాలకు వారి కష్ట సమయాల్లో సహాయం చేసేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.