బోల్పూర్ (పశ్చిమబెంగాల్), ఆగస్టు 11: పశ్చిమబెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల మంత్రి హోదాలో ఉన్న పార్థ చటర్జీని ఈడీ అధికారులు అరెస్టు చేయగా.. తాజాగా తృణమూల్ సీనియర్ నాయకుడు అనుబ్రాత మండల్ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
పశువుల అక్రమ రవాణా కేసులో తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ అధికారులు నోటీసులు జారీ చేసినా మండల్ హాజరుకాలేదు. దీంతో గురువారం బిర్భుమ్ జిల్లాలోని ఆయన నివాసానికి 30 కార్ల కాన్వాయ్తో వచ్చిన సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. దాదాపు గంటసేపు మండల్ను ఓ గదిలో ఉంచి మరి ఈ తనిఖీలు జరిపారు. అనంతరం ఆయనను అరెస్టు చేశారు. మండల్ సన్నిహితుల ఇండ్లలోనూ తనిఖీలు జరిపామని వెల్లడించారు.