Delhi | కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం భేటీ అయ్యారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. అయితే వచ్చే సంవత్సరం జనవరి 22న మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకుననారు. ఈ సమావేశం తర్వాతే ఎన్నికలను నిర్వహించాలా? వద్దా? అన్న విషయంలో ఈసీ తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల పెరుగుదల, వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ప్రధానంగా చర్చించారు. అయితే ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కేసుల తీవ్రత, వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరు గురించి ఈసీ ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది.
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయా? జరగవా? అన్న విషయంలో దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. యూపీ ఎన్నికలు వాయిదా వేయాలంటూ అలహాబాద్ హైకోర్టు ప్రధాని మోదీకి సూచించింది. మరోవైపు ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించింది. తాము యూపీలో ఓ సారి పర్యటిస్తామని, క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే తుది నిర్ణయానికి వస్తామని ఈసీ స్పష్టం చేసిన విషయం విదితమే.