న్యూఢిల్లీ, జూన్ 18: ప్రపంచ ఇంధన ధరలు తగ్గినప్పటికీ భారతీయ వినియోగదారులకు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇప్పట్లో ఊరట లభించే అవకాశం కనిపించడం లేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ ఆ ప్రభావం వినియోగదారులకు ఇంధన ధరల తగ్గింపు రూపంలో చేరడానికి కొంత సమయం పడుతుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి గురువారం తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినంత మాత్రాన ఇంధన ధరలను వెంటనే తగ్గించడం సాధ్యం కాదని మంత్రి అన్నారు. తక్కువ ధరకు లభించే ముడి చమురు రవాణా భారత్కు చేరడానికి పట్టే సమయం సహా అనేక అంశాలు రిటైల్ విక్రయ ధరలను ప్రభావితం చేస్తాయని తెలిపారు. ముడి చమురు హొర్ముజ్ జలసంధి మీదుగా భారత్కు రావాలని, ఈ మార్గంలో నౌకల రద్దీ అధికంగా ఉండటం వల్ల కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు. వినియోగదారులపై లీటరుకు సుమారు రూ. 3.94 భారం మాత్రమే పడిందని ఆయన చెప్పుకొచ్చారు.