న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: లెక్కల్లో చూపని రూ. 54,282.32 కోట్ల వ్యయంపై అన్ని వర్గాల నుంచి కేంద్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది. ఇన్ని వేల కోట్ల వ్యయానికి లెక్కలు చూపెట్టకపోవడాన్ని ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన నివేదిక కేంద్రాన్ని తప్పుబట్టింది. ప్రస్తుతం పలు మీడియాలు, ఆన్లైన్ వేదికలుగా దీనిపై తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఇంత జరుగుతున్నా దీనిపై కేంద్రం నోరుమెదపకపోవడం గమనార్హం.
ఈ నెల మొదట్లో పార్లమెంట్లో కాగ్ నివేదికను ప్రవేశపెట్టగా, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ హయాంలో ఆర్థిక పారదర్శకత, జవాబుదారీతనాన్ని విపక్షాలు ప్రశ్నించాయి. కాగ్ నివేదిక ప్రకారం రూ. 54,282.32 కోట్ల ఈ మొత్తం 15 మంత్రిత్వ శాఖల పరిధిలో పెండింగ్లో ఉన్న 33,973 వినియోగ ధ్రువీకరణ పత్రాల (యూసీల)కు సంబంధించినది.
అంటే పథకాల కోసం కేటాయించిన నిధుల వినియోగాన్ని ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించ లేదు. ఇందులో రూ. 18,273 కోట్లు హౌసింగ్ విభాగానికి, రూ. 14,340 కోట్లు ఉన్నత విద్యకు, రూ. 21,649.32 కోట్లు మిగిలిన శాఖలకు సంబంధించినవి. అంతేకాకుండా రూ. 12.574 కోట్లు తప్పుడు పద్దుల్లో వేశారు. రూ. 9,222 కోట్ల పన్నులు నిర్ణీత తేదీలోగా బదిలీ కాలేదని కాగ్ నివేదిక వెల్లడించింది.