న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం (జూలై 17) అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. పార్లమెంటు ఉభయ సభలు జూలై 18 నుంచి సమావేశమయ్యే అవకాశం ఉంది. అదే రోజు రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగుస్తాయి.
వర్షాకాల సమావేశాలు సాధారణంగా జూలై మూడో వారంలో ప్రారంభమై స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ముగుస్తాయి. ఈ సారి రాష్ట్రపతి ఎన్నికతోపాటు ఉపరాష్ట్రపతి పదవికి కూడా ఈ సెషన్లోనే ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ చైర్మన్గా ఉన్న ఉపరాష్ట్రపతి పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది.ఈ సారి రాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారి కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికకు లోక్సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఈ సమావేశాల్లోనే రెండు రాజ్యాంగ పదవులకు సంబంధించిన కౌంటింగ్ కూడా పార్లమెంట్లోనే జరుగనుంది. 2022 శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో జరుగుతాయని లోక్సభ స్పీకర్ అనేక సందర్భాల్లో ప్రకటించినందున, ప్రస్తుత పార్లమెంట్ భవనంలో ఇదే చివరి సెషన్ కావచ్చు.