న్యూఢిల్లీ, జూన్ 20: కేంద్ర ప్రభుత్వం 16 ఫిక్స్డ్-డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) ఔషధాల తయారీ, విక్రయం, పంపిణీని నిషేధించింది. చికిత్సాపరమైన సమర్థన లేకపోవడం, వాటి వల్ల కలిగే ముప్పులతో పోలిస్తే వాటిని నిరంతరం వాడటం వల్ల ఒనగూరే ప్రయోజనం లేదని పేర్కొంటూ వీటిని నిషేధించినట్లు కేంద్రం తెలిపింది. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం, ఔషధాల హేతుబద్ధమైన వినియోగాన్ని ప్రోత్సహించడం, అలాగే ప్రభావవంతమైన, శాస్త్రీయంగా ధృవీకరించిన ఔషధాలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడటం దీని లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
నిషేధిత ఫార్ములేషన్లలో కొన్ని చర్మ సంబంధిత మందులు, నొప్పి నివారణ మందులు, కండరాల సడలింపు మందులు, యాంటీబయాటిక్ సహా పలు రకాల చికిత్సా విభాగాలు ఉన్నాయని కేంద్రం పేర్కొన్నది. నిషేధిత జాబితాలో కలబంధ లేదా కలబంధ సారంతో పాటు విటమిన్ ఇ, జోఓబా నూనె, నారింజ నూనె, గోధుమ వంటి పదార్థాల కలయికలను కలిగి ఉన్న అనేక చర్మ వ్యాధి, చర్మ సంరక్షణ ఫార్ములేషన్లు కూడా ఉన్నాయి. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940లోని సెక్షన్ 26ఏ కింద జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా మంత్రిత్వశాఖ ఎఫ్డీసీని నిషేధించింది. మానవ వినియోగం కోసం గుర్తించిన 16 ఎఫ్డీసీల తయారీ, అమ్మకం, పంపిణీ, సరఫరాపై దేశవ్యాప్తంగా నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది.