న్యూఢిల్లీ: విపక్ష నేతలకు పనిగట్టుకుని కుట్రపూరితంగా భద్రతను కుదిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అధికార బీజేపీ నేతలకు మాత్రం సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేస్తున్నది. తాజాగా అసోం సీఎం హిమాంత బిశ్వశర్మకు భద్రతను పెంచింది. ఇదివరకు ఆయనకు జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ ఉండగా.. ఇప్పుడు దాన్ని జెడ్ ప్లస్ క్యాటగిరీకి మార్చారు.
గతంలో దేశంలోని ఈశాన్య ప్రాంతంలో మాత్రమే శర్మకు జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ వర్తింపజేయగా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా జెడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యూరిటీని వర్తింపజేయనున్నారు. సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీతో సంప్రదింపుల అనంతరం కేంద్ర హోంశాఖ హిమాంత భద్రత పెంపు నిర్ణయం తీసుకుంది. అనంతరం ఆయనకు దేశమంతటా జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కల్పించాలని సీఆర్పీఎఫ్ను కోరింది.
కాగా, జెడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యూరిటీ ప్రొటోకాల్ ప్రకారం.. నిత్యం 50 మంది సీఆర్పీఎఫ్ కమెండోలు ఆయనకు కాపలా కాస్తుంటారు. అంటే హిమాంత బిశ్వశర్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా 50 మంది సీఆర్పీఎఫ్ కమెండోల రక్షణ ఉంటుంది. శర్మకు 2017లో జడ్ క్యాటగిరీ భద్రత కల్పించారు. అది కూడా కేవలం ఈశాన్య ప్రాంతంలో మాత్రమే వర్తించేది.