(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : ఆప్తమిత్రుల బంధం మరోసారి బట్టబయలైంది. రూ. 2,238 కోట్ల సెక్యూరిటీల మోసం కేసులో అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీని, ఆయన కంపెనీలను కాపాడేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగింది. దీని కోసం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే అత్యంత బలమైన నియంత్రణ సంస్థగా పిలిచే అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)తోనే ఢీకి సిద్ధపడింది. అదానీకి సమన్లు జారీ చేయాలని గడిచిన 14 నెలల్లో ఎస్ఈసీ ఆరుసార్లు విజ్ఞప్తి చేస్తే.. చివరకు స్పందించిన కేంద్రం.. హేగ్ సర్వీస్ ఒప్పందాన్ని సాకుగా చూపిస్తూ.. ఈ సమన్లను తాము ఇవ్వలేమని చల్లగా చెప్పింది. అదానీ కంపెనీని రక్షించేందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నదని సోషల్మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది. బీజేపీ సర్కారు వైఖరిపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
రూ. 2,238 కోట్ల సెక్యూరిటీల మోసం కేసులో గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి సమన్లు జారీచేయడానికి భారత్లోని మోదీ సర్కారు నుంచి గడిచిన 14 నెలలుగా ఎటువంటి సహాయ సహకారాలు లభించడం లేదని న్యూయార్క్లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో బుధవారం ఎస్ఈసీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆరోసారి తాము చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం.. హేగ్ సర్వీస్ ఒప్పందం నిబంధనలకు విరుద్ధంగా ఈ సమన్లు ఉన్నాయని, కాబట్టి అదానీకి తాము ఈ సమన్లు జారీ చేయలేమని బదులిచ్చిందని వాపోయింది. తాము హెగ్ సర్వీస్ ఒప్పందంలోని అన్ని రూల్స్ పాటించామని ఎస్ఈసీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. సంతకాలు, ముద్రలు లేవంటూ గత ఏప్రిల్లోనూ కేంద్రప్రభుత్వం ఇలాగే సమన్ల జారీకి సాకులు చెప్పిందని ఎస్ఈసీ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఇకపై, తాము భారత న్యాయ మంత్రిత్వశాఖ ద్వారా అదానీకి సమన్లను జారీ చేయలేమని, డైరెక్టుగా కంపెనీ అధికారిక ఈ-మెయిల్కు సమన్లను ఇచ్చే వెసులుబాటును కల్పించాలని న్యాయస్థానాన్ని కోరింది. హేగ్ సర్వీస్ ఒప్పందం ప్రకారం.. ఏదైనా కేసు విషయంలో భారత్లో నివసిస్తున్న ప్రతివాదులకు సమన్లు ఇవ్వాలంటే ఆ సమన్లతో పాటు ఫిర్యాదు ప్రతిని కూడా జారీచేయాల్సి ఉంటుందని ఎస్ఈసీ ఈ సందర్భంగా కోర్టుకు గుర్తు చేసింది. ఈ కేసులో ప్రతివాదులకు (గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ) సమన్లు, ఫిర్యాదును అందచేయడానికి భారత న్యాయ శాఖ సాయాన్ని కోరినట్లు తెలిపింది. 2021 సెప్టెంబర్లో రుణాలు పొందే క్రమంలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గురించి గౌతమ్ అదానీ, సాగర్ అదానీ తప్పుడు ప్రకటనలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేసింది. ఈ క్రమంలోనే 2024 నవంబర్ 20న ఫెడరల్ కోర్టులో కేసు దాఖలు చేసినట్టు తెలిపింది. ఈ కేసులో ఫెడరల్ సెక్యూరిటీల చట్టాన్ని ఉల్లంఘించారని అదానీపై ఆరోపణలు చేసింది. కాగా.. సివిల్ ప్రొసీజర్కి చెందిన ఫెడరల్ నిబంధనల్లోని 4(ఎఫ్) కింద ప్రతివాదులు కోర్టులో తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అదానీకి సమన్లు జారీ చేయడానికి భారత న్యాయ శాఖ సాయాన్ని కోరినట్లు ఎస్ఈసీ తెలిపింది.
యావత్తు ప్రపంచం పునరుత్పాదక శక్తి రంగంవైపు అడుగులు వేస్తున్న క్రమంలో సౌర విద్యుత్తు రంగంలో పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టాలని అదానీ గ్రూప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎలాంటి పోటీ లేకుండా కాంట్రాక్ట్ టెండర్లు దక్కించుకోవడానికి ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు రూ. 2,238 కోట్ల మేర లంచాలు ఆఫర్ చేసినట్టు ఎఫ్బీఐ తన ఆరోపణల్లో వెల్లడించింది. తద్వారా వచ్చే 20 ఏండ్లలో కనిష్ఠంగా 2 బిలియన్ డాలర్లను లబ్ధి పొందేందుకు అదానీ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఆరోపించింది. ఈ లంచం సొమ్మును సేకరించడానికి అమెరికాలోని బ్యాంకులు, పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపుచ్చే ప్రయత్నాలు చేసినట్టు తెలిపింది. ఈ కేసులో నిందితులు ఎఫ్బీఐ, ఎస్ఈసీ దర్యాప్తును అడ్డుకోవడానికి కూడా కుట్ర పన్నినట్టు ఎస్ఈసీ ఆరోపించడం గమనార్హం.
అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్ కంపెనీల్లో స్టాక్ మ్యానిప్యులేషన్ జరిగినట్టు సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై అమెరికాలోని బ్రూక్లిన్ జిల్లా కోర్టులో విచారణ కొనసాగింది. ఈ క్రమంలో కేసు పూర్వాపరాలను పరిశీలించిన కొందరు న్యాయవాదులకు సోలార్ ఎనర్జీ కాంట్రాక్టు టెండర్లలోనూ అక్రమాలు జరిగినట్టు అనుమానాలు వచ్చాయి. దీంతో వాళ్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు అమెరికాలోని మీడియా తెలిపింది.
ఎఫ్బీఐ అభియోగాల్లో పేర్కొన్న 8 మంది నిందితుల్లో నలుగురికి అమెరికా పౌరసత్వం ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ స్కామ్లో అమెరికా ఇన్వెస్టర్లు, అమెరికా బ్యాంకుల నిధులు ఉన్నాయి. నిందితుల జాబితాలోని అజురా పవర్ కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజీలో లిస్ట్ అయ్యి ఉన్నది. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణను అమెరికా కోర్టు ప్రారంభించింది.
అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడినట్టు తేలితే అమెరికాలోని ఫారిన్ కరప్ట్ ప్రాక్టిసెస్ యాక్ట్ (ఎఫ్సీపీఏ) ప్రకారం.. గౌతమ్ అదానీకి ఐదేండ్ల జైలు శిక్షతో పాటు 2 మిలియన్ డాలర్ల జరిమానా విధించవచ్చని న్యాయ కోవిదులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు 2008నాటి సీమెన్స్ ఏజీ, 2012లో ఎలీలిల్లీ కంపెనీ కేసులను ఉదహరిస్తున్నారు.
గౌతమ్ అదానీకి సమన్లను జారీ చేయడానికి మోదీ ప్రభుత్వం ఎంతమాత్రం సహకరించట్లేదని ఎస్ఈసీ ఆరోపించడంపై రాజకీయ వర్గాల్లో పెద్దయెత్తున దుమారం రేగుతున్నది. బొగ్గు గనుల నుంచి పోర్టుల వరకూ, రిటైల్ వ్యాపారం నుంచి విమానాశ్రయాల వరకూ మొత్తంగా దేశాన్నే అదానీకి గంపగుత్తగా కట్టబెట్టిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు అమెరికాలో దాఖలైన కేసు నుంచి అదానీని తప్పించడానికి ఇలా చేస్తున్నదని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన నేరారోపణలు రుజువైతే ఆయన్ని భారత్.. అమెరికాకు అప్పగించాల్సిందేనని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఈ మేరకు ఇండియా-అమెరికా మధ్య వాషింగ్టన్లో జూన్ 25, 1997లో జరిగిన నేరస్తుల అప్పగింతల ఒప్పందాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికాలో నమోదైన అభియోగాలు నిరూపితమైతే నిందితులు అక్కడే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నేరం రుజువైతే అదానీని అమెరికాకు పంపించాల్సిందేనని న్యాయకోవిదులు చెప్తున్నారు. అందుకే, అదానీకి సమన్లను జారీ చేయడానికి మోదీ ప్రభుత్వం ఎస్ఈసీకి సహకరించట్లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. అదానీని కాపాడేందుకే, మోదీ ప్రభుత్వం ఇలా చేస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు.