హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు రంగంలో సంస్కరణల విషయంలో దేశమంతా వ్యతిరేకత వచ్చినా కేంద్రంలోని బీజేపీ సర్కారు తాను అనుకొన్నదే చేస్తున్నది. నరేంద్ర మోదీ సర్కారు రూపొందించిన విద్యుత్తు సవరణల బిల్లు-2020 ఇంకా పార్లమెంట్లో ఆమోదం పొందకపోవడంతో, దాని అమలుకు ఇతర మార్గాల్లో రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు, డిస్కంలపై ఒత్తిడి పెంచుతూ ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేస్తున్నది. చెప్పినవన్నీ చేస్తేనే డిస్కంలకు ఆర్థిక సహాయం చేస్తామని, సబ్సిడీలు ఇస్తామని షరతులు పెడుతున్నది. విధిలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించటం ప్రారంభించింది.
శ్రీకాకుళంలో మొదలు
వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాను ఎంపికచేసి పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. జిల్లాలో సుమారు 30 వేల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. వీటన్నింటికీ స్మార్ట్ మీటర్లను బిగించారు. వ్యవసాయానికి ఎంత విద్యుత్తును వాడుతున్నారనేది మీటర్లలో రికార్డు అవుతున్నది. నెల తిరిగేసరికి మీరు వ్యవసాయానికి ఇంత విద్యుత్తు వాడారు.. బిల్లు కట్టండి అంటూ బిల్లులను రైతుల చేతుల్లో పెడుతున్నారు. రైతులకు విద్యుత్తు సబ్సిడీ ఇచ్చి, వారి అకౌంట్లలో సబ్సిడీ సొమ్ము వేస్తామని ఏపీ అధికారులు చెప్తున్నారు. ఆ సొమ్ముతో రైతులు డిస్కంలకు విద్యుత్తు బిల్లులు చెల్లించాలని సూచిస్తున్నారు. ఇందుకోసం రైతుల పేరిట బ్యాంకుల్లో ప్రత్యేక ఖాతాలు తెరిపించడానికి కసరత్తు చేస్తున్నారు. బిల్లులు వచ్చిన తరువాత అది ఎప్పటికైనా కట్టాల్సిందేనని రైతులు వాపోతున్నారు. పైలట్ ప్రాజెక్టు కావడంతో రైతులపై అధికారులు ఒత్తిడి తేవటంలేదని సమాచారం. ఏపీలో వ్యవయాసానికి రాష్టప్రభుత్వం విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నది. ఇప్పుడు రైతుల చేతికి బిల్లులు వస్తుండటంతో వారిలో ఆందోళన మొదలైంది.
బెదిరింపులతో లొంగదీస్తూ
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించడంతో భవిష్యత్తులో కావాల్సిన ప్రత్యేక ఫీడర్లు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతోపాటు సాంకేతికంగా ఏర్పడే ఇబ్బందులను పరిష్కరించడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపిన తర్వాత బిల్లుల వసూలుపై దృష్టి పెట్టనున్నారని సమాచారం. ఏపీలోని మిగతా జిల్లాల్లోనూ మీటర్ల బిగింపునకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఇన్నాళ్లు ఉచిత విద్యుత్తుతో ధైర్యంగా వ్యవసాయం చేసిన రైతులు ఇప్పుడు నెల తిరిగేసరికి బిల్లు చేతికి వస్తుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇతర రాష్ర్టాల్లో కూడా స్మార్ట్ మీటర్ల బిగింపు మొదలుపెట్టారు. వీటిని వ్యతిరేకిస్తున్న తెలంగాణ లాంటి రాష్ర్టాలపై కేంద్రం నిబంధనలు, షరతుల పేరుతో ఆర్థిక సాయం చేయకుండా ఒత్తిడి పెంచుతున్నది. కొన్ని రాష్ర్టాలపై రాజకీయంగా కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.