హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రైతుల బాగోగులు చూసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం హైకోర్టు శోచనీయమని వ్యాఖ్యానించింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్రం జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడం తమ పరిధిలో లేదని, ఇది హోంశాఖ పరిధిలోని అంశమని కేంద్ర వ్యవసాయశాఖ పేరొనడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. 2020 అక్టోబర్, నవంబర్లో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో రైతులు భారీగా నష్టపోయారని, ఈ నష్టాలను అంచనా వేయించి జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ పథకాల ద్వారా రైతులను ఆదుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వేర్వేరు ప్రజాహిత వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ టీ వినోద్కుమార్తో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ ఆశ్చర్యకరంగా ఉన్నదని, ఇదేమి కౌంటర్ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. రైతులను ఆదుకోవడం తమ పరిధిలో లేదని వ్యవసాయశాఖ చెప్పడం ఏమిటని నిలదీసింది. కరవు, వరదలు సంభవించినప్పుడు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖదేనని తేల్చిచెప్పింది. తమకు కొంత సమయమిస్తే పూర్తి వివరాలను నివేదిస్తామని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నామారపు రాజేశ్వర్రావు చెప్పడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ‘గతేడాది నవంబర్లో దాఖలైన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఇంకా సమయం కావాలా?’ అని ప్రశ్నించింది. ఏజీ వేరే కోర్టులో ఉన్నారని, వాదనలు వినిపించేందుకు గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది పీ రాథీప్రెడ్డి కోరడంతో.. ఈ నెల 8న జరిగే విచారణలో ఏజీ వాదనలు వినిపించాలని హైకోర్టు ఆదేశించింది. మరోసారి గడువిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
రైతుబంధుతో ఆదుకొంటున్నాం..
రైతుల సంక్షేమానికి అన్ని చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రైతుబంధుతో ఏటా అన్నదాతలను ఆర్థికంగా ఆదుకొంటున్నామని, ఆ డబ్బును నేరుగా పట్టాదారులైన రైతులకే చెల్లిస్తున్నామని కౌంటర్లో పేర్కొన్నది. పంటలను సాగుచేస్తున్న రైతులందరికీ రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపింది. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, ప్రకృతి వైపరీత్యాల వారి పంటలు దెబ్బతింటే సాయం అందడంలేదని, వేరే పథకాలను సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం సాయం చేయడంలేదని వివరించింది. విపత్తుల నిర్వహణ చట్టం కింద కౌలు రైతులను కూడా ఆదుకునేలా చేయాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం తన కౌంటర్లో విన్నవించింది.