న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై ఇటీవల బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించింది. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై ఆ డాక్యుమెంటరీలో కొన్ని అంశాలను ప్రజెంట్ చేశారు. అయితే ఆ డాక్యుమెంటరీకి చెందిన ట్విట్టర్, యూట్యూబ్ లింక్లను షేర్ చేయరాదంటూ ఇవాళ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇండియా.. ద మోదీ క్వశ్చన్ టైటిల్తో ఉన్న డాక్యుమెంటరీ ఇక నుంచి మైక్రోబ్లాగింగ్, వీడియో షేరింగ్ వెబ్సైట్లలో కనిపించవని పేర్కొన్నారు.
మోదీపై తీసిన డాక్యుమెంటరీని శుక్రవారం బీబీసీ సమర్ధించుకున్నది. చాలా లోతుగా అధ్యయనం చేసి ఆ డాక్యుమెంటరీ తీసినట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఆ డాక్యుమెంటరీలో నిష్పాక్షికత లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. గుజరాత్ అల్లర్లలో మోదీ హస్తం ఉన్న విషయం బ్రిటన్ ప్రభుత్వానికి తెలుసు అని కూడా బీబీసీ తన కథనంలో పేర్కొన్నది. ఈ అంశాన్ని ఇటీవల ఆ దేశ ప్రధాని రిషి సునాక్ ఖండించారు.