న్యూఢిల్లీ, మే 31(నమస్తే తెలంగాణ): సహకార రంగంలో ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా గిడ్డంగుల నిర్మాణాలు చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. తొలుత దేశవ్యాప్తంగా పది జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాబోయే ఐదేండ్లలో లక్ష కోట్లు ఖర్చు చేయబోతున్నామని బుధవారం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ మీడియాకు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో ధాన్యం నిల్వ సామర్థ్యం 1,450 లక్షల టన్నులు ఉందన్నారు. వచ్చే ఐదేండ్లలో నిల్వ సామర్థ్యం 2,150 లక్షల టన్నులకు పెంచడమే లక్ష్యమన్నారు. ప్రతిపాదిత పథకాన్ని సహకార రంగంలో ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఆహారధాన్యాల నిల్వ కార్యక్రమం‘గా పేర్కొన్నారు. ప్రతి బ్లాక్లో 2వేల టన్నుల సామర్థ్యం గల గోడౌన్ను ఏర్పాటు చేయనున్నట్టు ఠాకూర్ తెలిపారు.