న్యూఢిల్లీ: మణిపూర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన కేసు(Manipur Viral Video Case)లో సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కుకీ తెగలకు చెందిన మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనకు చెందిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వైరల్ వీడియో కేసులో దర్యాప్తు చేపట్టనున్నట్లు గురువారం సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మణిపూర్ ప్రభుత్వంతో చర్చలు నిర్వహించిన తర్వాతే ఆ కేసును సీబీఐకి అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు.
కాంగ్పోప్కీ జిల్లాలో మే 4వ తేదీన ఇద్దరు మహిళల్ని న్యూడ్గా ఊరేగించిన ఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ మణిపూర్ అంశం దుమారం రేపుతోంది. ఇవాళ 20 మంది విపక్ష నేతలు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.