Manipur | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): మణిపూర్లో హింస చెలరేగి దాదాపు రెండున్నర నెలలు అయింది. హింసాత్మక ఘటనల్లో 120కి పైగా గ్రామాల్లో దాదాపు 3,500 ఇండ్లు, 220 చర్చిలు, 15 గుడులు మంటల్లో, దాడుల్లో ధ్వంసమయ్యాయి. ప్రజల జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రాష్ట్రంలో సైనికులు, పోలీసుల పహారాలో సామాన్యుడు బతుకీడుస్తున్నాడు.
ఓవైపు విద్యా సంవత్సరం ప్రారంభమైనా.. పిల్లలు బడులకు వెళ్లలేని పరిస్థితులు నెలకొనగా, మరోవైపు వ్యవసాయం, పర్యాటకం తదితర రంగాలు దెబ్బతిన్నాయి. వర్షాలు పడుతున్నా రైతులు పొలాల్లో విత్తనాలు నాటే పరిస్థితులు కనిపించటం లేదు. రాజధాని ఇంఫాల్, చుర్చంద్పూర్, కాంగ్పోక్పి సహా పలు జిల్లాల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకోవడంతో 144 సెక్షన్ అమలవుతున్నది. రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయనే విమర్శలు వస్తున్నాయి.
రైతుల రక్షణకు జవాన్లు
హింస కారణంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు పెద్దగా కనిపించడం లేదు. కొన్ని చోట్ల మాత్రమే కొంతమంది రైతులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పొలాలకు వెళ్తున్నారు. దీంతో ఈ ఏడాది వ్యవసాయ ఉత్పత్తి పడిపోయే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో రైతులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా మణిపూర్ రైఫిల్స్ను మోహరించారు. ఇందుకు 2,267 మంది జవాన్లను కేటాయించామని మణిపుర్ ఐజీ ముయివాహ్ తెలిపారు.
రోజూ కాల్పుల మోత
మణిపూర్లో ప్రతిరోజూ ఎక్కడో చోట కాల్పుల మోత వినిపిస్తూనే ఉన్నది. కుకీ, మైతీ వర్గాలకు చెందిన సామాన్య పౌరులు తుపాకులు పట్టి బంకర్లలో ఉంటున్నారు. కాల్పుల్లో ఎవరు చనిపోయినా, మరో వర్గం వారు.. చనిపోయిన వ్యక్తిని మిలిటెంట్ అంటూ ముద్ర వేస్తున్నారు.
వెలవెలబోతున్న పర్యాటకం
మణిపూర్లో పర్యాటక రంగం నుంచి గణనీయంగా ఆదాయం వస్తుంది. ఇక్కడి పర్యాటక ప్రాంతాల్లో లోక్టక్ సరస్సు ఒకటి. హింస చెలరేగిన తర్వాత దీన్ని మూసేశారు. 2001లో మణిపూర్కు 74 వేల మంది పర్యాటకులు వెళ్తే, 2020లో దాదాపు 2 లక్షల మంది పర్యాటకులు వెళ్లారు. అదే 2023 జూలైలో ఒక్కరు కూడా రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2013లో పర్యాటకం ద్వారా ఖజానాకు రూ.17 లక్షల ఆదాయం వసే,్త 2023 లో మార్చి నెల వరకు రూ.1.25 కోట్ల ఆదాయం లభించింది. ఈ జూలైలో పర్యాటక రంగానికి ఆదాయం లభించలేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
శాంతి పునరుద్ధరణలో చిత్తశుద్ధి ఏదీ?
బీజేపీ అధికారంలో ఉన్న మణిపూర్లో పాలన పూర్తిగా గాడి తప్పిందనే విమర్శలు వస్తున్నాయి. శాంతి భద్రతలు క్షీణించాయి. నిత్యం జరుగుతున్న హింసాత్మక ఘటనలతో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు దాదాపు 150 మంది మరణించారని అంచనా. 60 వేల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులను నెలకొల్పేందుకు అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ చిత్తశుద్ధితో చర్యలు తీసుకొంటున్న కనిపించడం లేదని ప్రతిపక్షాలు, పౌర సంఘాలు విమర్శిస్తున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాలు, రాజకీయ ప్రాబల్యం కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలే హింసను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.