న్యూఢిల్లీ, జూన్ 23: దేశంలో విద్యుత్ వినియోగదారులపై భారాన్ని తగ్గిస్తామని చెప్తూ కేంద్రం కొత్త విధివిధానాలను అమలులోకి తేనుంది. టైం ఆఫ్ ది డే (టీవోడీ) ప్రాతిపదికన పగలు తక్కువ చార్జీలను అమలు చేస్తామని వెల్లడించింది. ఈ టీవోడీ టారిఫ్ 10 కేడబ్ల్యూ అంతకన్నా ఎక్కువ విద్యుత్ను వినియోగించే కమర్షియల్, ఇండస్ట్రీయల్ వినియోగదారులకు ఏప్రిల్ 1, 2024 నుంచి, వ్యవసాయ వినియోగదారులు తప్ప మిగిలిన అన్ని కేటగిరీల వారికి ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. స్మార్ట్ మీటర్లు కలిగిన వారికి ఇది వెంటనే అమలవుతుంది. ఒక వేళ ఆమర్చక పోతే అది ఏర్పాటు చేసిన తేదీ నుంచి టారిఫ్ను అమలు చేస్తారు.
కొత్త విధానం ప్రకారం పగటిపూట సాధారణ చార్జీల కన్నా 10 నుంచి 20 శాతం తగ్గిస్తారు. రాత్రిపూట వినియోగానికి 10 నుంచి 20 శాతం అధికంగా వసూలు చేస్తారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చవక కాబట్టి పగటిపూట టారిఫ్ తక్కువని, నాన్ సోలార్ హవర్స్ అనగా రాత్రిపూట హైడ్రో పవర్ ఎక్కువగా వినియోగిస్తారని, దాని ఉత్పత్తి ఖరీదు కూడా ఎక్కువ కాబట్టి రాత్రిపూట టారిఫ్ అధికమని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ చెప్పారు. ప్రస్తుతం సౌర విద్యుత్తును గౌతమ్ అదానీకి చెందిన కంపెనీలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. అదానీకి మేలు చేసేందుకే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని విద్యుత్తు రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.