న్యూఢిల్లీ, మే 10: దేశంలో అమలవుతున్న కరోనా వ్యాక్సినేషన్ విధానాన్ని వైద్య నిపుణుల మార్గనిర్దేశంలో, పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో రూపొందించామని.. ఈ విధానంలో న్యాయవ్యవస్థ జోక్యం ఎంతమాత్రం అవసరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో కార్యనిర్వాహక వ్యవస్థకు ఉన్న సామర్థ్యాన్ని, విజ్ఞతను విశ్వసించాలని పేర్కొన్నది. వ్యాక్సినేషన్ విధానంలో న్యాయవ్యవస్థ సదుద్దేశంతోనే అయినప్పటికీ తొందరపాటుతో జోక్యం చేసుకుంటే.. అది ఊహించలేని, అవాంఛనీయ పరిణామాలకు దారి తీయవచ్చని హెచ్చరించింది. దేశంలో కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటం, నియంత్రణ అంశాల్ని సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టుకు ఈ మేరకు కేంద్రం ఆదివారం రాత్రి 218 పేజీల అఫిడవిట్ను సమర్పించింది. ఈ వివరాలు సోమవారం వెల్లడయ్యాయి.
నిపుణులతో, రాష్ట్రప్రభుత్వాలతో, వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో పలుమార్లు చర్చలు జరిపిన తర్వాతనే వ్యాక్సినేషన్ విధానాన్ని రూపొందించామని కేంద్రం ఈ అఫిడవిట్లో తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ ప్రజలందరికీ ఉచితంగా టీకాలను అందజేస్తామని ప్రకటించాయి కాబట్టి.. టీకా కంపెనీలు టీకాలకు ధరలను నిర్ణయించినప్పటికీ.. అది ప్రజలపై భారం కాబోదని కేంద్రం పేర్కొంది. టీకా తయారీ కంపెనీలతో తాము జరిపిన చర్చల కారణంగానే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకే ధరతో వ్యాక్సిన్లను అందించటానికి అవి అంగీకరించాయని వెల్లడించింది.
కరోనా కష్టకాలంలో.. మనుషుల బాధల మీద వ్యాపారం చేస్తే ఎంతమాత్రం సహించబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఔషధాలను బ్లాక్మార్కెటింగ్ చేసేవారిని, అక్రమంగా దాచి పెట్టేవారిని ఉపేక్షించబోమని, వారిపై ఉక్కుపాదం మోపాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టంచేశామని సుప్రీంకోర్టుకు తెలిపింది. పోలీసు, శాంతిభద్రతల అంశం రాష్ట్రప్రభుత్వాల చేతుల్లో ఉండే అంశం కాబట్టి.. ఈ మేరకు రాష్ట్రాలకు సూచనలు జారీ చేశామని పేర్కొంది.