Pension | న్యూఢిల్లీ: కుటుంబ పెన్షన్కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగినులు కుటుంబ పింఛను కోసం భర్తను కాకుండా, తమ కుమార్తె లేదా కుమారుడిని నామినేట్ చేసేందుకు వెసులుబాటు కల్పించింది. ఇప్పటి వరకు అమలైన నిబంధనల ప్రకారం, ప్రభుత్వోద్యోగి లేదా పింఛనుదారు మరణిస్తే, ఆ వ్యక్తి యొక్క భార్య లేదా భర్తకు కుటుంబ పింఛనును మంజూరు చేసేవారు.
ఆ విధంగా పింఛనును పొందిన వ్యక్తి కూడా మరణించిన తర్వాత లేదా అనర్హుడైన అనంతరం మాత్రమే ఇతర కుటుంబ సభ్యులకు దానిని పొందే అర్హత లభించేది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 2021కు సవరణలు జరిగాయని చెప్పారు. మహిళా ప్రభుత్వోద్యోగి మరణిస్తే, ఆమె భర్తకు కాకుండా, అర్హత గల ఆమె బిడ్డ లేదా పిల్లలకు కుటుంబ పింఛనును మంజూరు చేయడానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు.