పాలక్కడ్, నవంబర్ 14: దేశంలోని సహకార వ్యవస్థను ధ్వంసం చేసేందుకు కేంద్ర సర్కారు యత్నిస్తున్నదని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మండిపడ్డారు. దేశంలో శతాబ్దాల చరిత్ర కలిగిన సహకార రంగం ప్రజల జీవితాల్లో కీలకపాత్ర పోషించిందని తెలిపారు. కేరళలోని పాలక్కడ్లో సోమవారం ఆయన ఆలిండియా కోపరేటివ్ వీక్ను ప్రారంభించి మాట్లాడారు. ‘సహకార రంగంపై రాష్ర్టాలకే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ విధానానికి పెద్ద ఎదురుదెబ్బ. నోట్ల రద్దు ద్వారా సహకార రంగాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను కూడా మేము అధిగమించాం’ అని విజయన్ చెప్పారు. కొత్త ఉత్తర్వుల ద్వారా సహకార రంగంలో జోక్యం చేసుకొనేందుకు కేంద్రం యత్నిస్తున్నదని విమర్శించారు. మనది సమాఖ్య దేశమైనప్పటికీ సమాఖ్య చట్టాలను ఉల్లంఘించేందుకు కేంద్రం అనేక ప్రయత్నాలు చేస్తున్నదని మండిపడ్డారు.