Manipur | న్యూఢిల్లీ/ఇంఫాల్, జూన్ 27: మణిపూర్లో సాధారణ పరిస్థితులను నెలకొల్పే విషయంలో కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాల వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు ఉమ్మడిగా చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. ‘పర్వత జిల్లాల బాధ్యత మాది.. లోయ జిల్లాల బాధ్యత మీది’ అంటూ శాంతి పునరుద్ధరణపై బాధ్యతల విభజన ప్రతిపాదనతో మణిపూర్ సీఎం బీరేన్ సింగ్కు కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన సూచనలపై పౌరసంఘాలు మండిపడుతున్నాయి. ఈ తరహా వైఖరి ఆమోదనీయం కాదని పలు పౌర సంఘాల సమ్మేళనం కోఆర్డినేటింగ్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ(సీఓసీఓఎంఐ) సమన్వయకర్త రతన్కుమార్ సింగ్ అన్నారు.
‘ముఖ్యమంత్రి అంటే మణిపూర్ మొత్తానికి సీఎం, ఒక్క లోయకే కాదు! అమిత్షా దేశానికి హోంమంత్రి, ఒక్క మణిపూర్ పర్వత ప్రాంతాలకు కాదు!’ అని ఎత్తిచూపారు. సమస్యను వేర్వేరు ప్రాంతాలుగా కాకుండా, రాష్ట్రం మొత్తంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆదివారం అమిత్షాతో బీరేన్ సింగ్ సమావేశం తర్వాత సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘పర్వత జిల్లాల బాధ్యత తీసుకొంటామని కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చారు. ఇదే సమయంలో పౌర సంఘాల సహకారంతో లోయ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం శాంతి పునరుద్ధరించాలి’ అని సూచించారని బీరేన్ పేర్కొన్నారు.
మణిపూర్కు ఆయుధాల స్మగ్లింగ్
మణిపూర్లో పలువురు మహిళా ఆందోళనకారులు రోడ్లను బ్లాక్ చేస్తూ.. భద్రతా బలగాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో తిరిగి శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు తమకు సహకరించాలంటూ సైనికులు ప్రజలను కోరుతున్నారు. మరోవైపు మణిపూర్కు అక్రమంగా రవాణా అవుతున్న ఆయుధాలు, పేలుడు పదార్థాలను నాగాలాండ్లోని కోహిమాలో స్వాధీనం చేసుకొన్నారు.
బీరేన్ సర్కార్ను రద్దు చేయాలి : బీజేపీ ఎస్టీ మోర్చా
మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా డిమాండ్ చేసింది. మైనారిటీలపై మెజార్టీ కమ్యూనిటీ దాడులు కొనసాగుతున్నాయని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు సీఎం బీరేన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వమే కారణమని ఆరోపించింది. మణిపూర్లో శాంతి పునరుద్ధరణకు వీలైనంత తర్వాత ప్రస్తుత బీరేన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని ఎస్టీ మోర్చా డిమాండ్ చేసింది.