న్యూఢిల్లీ: ఎంతోకాలంగా వాయిదాపడుతూ వస్తున్న జనగణన (Census) ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది. దేశంలో 16 ఏండ్ల తర్వాత చేపడుతున్న ఈ జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) సోమవారం విడుదల కానుంది. రెండు దశల్లో జరుగనున్న ఈ ప్రక్రియ మొత్తంగా 16వదికాగా, స్వాతంత్య్రానంతరం చేపట్టబోయే 8వ జన గణన. తొలి దశలో భాగంగా హిమాలయ ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో 2026, అక్టోబర్ 1 నుంచి, రెండో దశలో భాగంగా 2027, మార్చి 1 నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జన గణనను చేపట్టనున్నారు.
ఈసారి జనాభా లెక్కలతోపాటే కులగణనను కూడా చేపట్టనున్నారు. దీనికోసం మొత్తం 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పని చేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదుచేసే వెసులుబాటునూ కల్పిస్తున్నారు. డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. సమాచారణ సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు పేర్కొంది. సెక్షన్ 3, జనగణన చట్టం, 1948 ప్రకారం జన-కులగణనను చేపట్టనున్నట్టు వివరించింది.
దేశంలో జనగణనను పదేండ్లకోసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2011లో ఈ ప్రక్రియను చేపట్టారు. రెండు విడుతల్లో ఈ ప్రక్రియ జరిగింది. వాస్తవానికి 2021లోనే జన గణనను నిర్వహించాలి. అయితే, కొవిడ్ కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. అయితే, ఇప్పుడు 16 ఏండ్ల తర్వాత తొలిసారిగా జనాభా గణనను నిర్వహించనున్నారు. దీంతోపాటు తొలిసారిగా కులగణనను కూడా చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటే కులగణనను కూడా చేపట్టనున్నట్టు గత నెలలో కేంద్రం వెల్లడించడం తెలిసిందే. కాగా జనాభా లెక్కల వివరాల నమోదుకు సంబంధించి ఇప్పటికే 30కి పైగా ప్రశ్నలను సిద్ధం చేసినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. అందులో ఓ కొత్త ప్రశ్న కూడా ఉంది. అదే ఈ జనగణన ప్రత్యేకత.
దేశంలో 1872 నుంచి జనగణన చేస్తున్నారు. జనాభా లెక్కల సేకరణలో భాగంగా 1931 నుంచి ఒకే విధమైన ప్రశ్నలే అడుగుతూ వస్తున్నారు. అయితే 1951 నుంచి ఇప్పటి వరకు అడగని ఒక ప్రశ్న ఈసారి జనగణనలో అడుగుతారు. అదే మీ కులం ఏంటి? అని. ఇందులో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల గురించి సమాచారం ఇంతకు ముందే ఉంది. అయితే ఈసారి జనగణనలో ప్రతి ఒక్కరికీ తమ కులం గురించి చెప్పే ఆప్షన్ ఉంటుంది. జనాభా లెక్కల సేకరణలో ఈసారి వస్తున్న పెద్ద మార్పు ఇదే. 1931 తర్వాత ఇప్పుడు జనగణన, కులగణనను ఒకేసారి చేపడుతున్నారు.
ఒక దేశం లేదా ఒక ప్రాంత ప్రజల ఆర్థిక, సామాజిక సమాచారాన్ని సేకరించడం, సంకలనం చేయడం, విశ్లేషించడం, ఆ తర్వాత దాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడాన్ని జనగణన అని అంటారు. జనగణనలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల వయసు, లింగం, భాష, మతం, విద్య, వృత్తి, ఎక్కడ నివసిస్తున్నారనే వివరాలు సేకరించనున్నారు. ఈ గణాంకాల ఆధారంగా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలను రూపొందిస్తారు.
2021లో జనగణన కోసం ప్రభుత్వం రూ. 8,754.23 కోట్లను కేటాయించింది. ఎన్పీఆర్ (నేషనల్ పాపులేషన్ రిజిష్టర్) అప్డేటింగ్ కోసం మరో రూ. 3,941.35 కోట్లను పక్కనబెట్టింది. అంటే మొత్తంగా రూ. 12,695.58 కోట్లను కేటాయించింది. అయితే, ఈ నాలుగేండ్లలో జనాభా పెరుగడంతో ప్రస్తుతం జనగణనకు రూ. 13 వేల కోట్ల వరకూ వ్యయం అయ్యే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, 2025-26లో జనగణన కోసం బడ్జెట్లో రూ. 574.80 కోట్ల నిధులను మాత్రమే కేంద్రం కేటాయించింది. దీంతో పలువురు జనగణన నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, జనగణనకు బడ్జెట్ కేటాయింపుల్లో సవరణలు చేయవచ్చని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి.