మెడికల్ టెస్టులు అక్కడి ల్యాబ్లోనే చేయించుకోవాలి
ట్యాబ్లెట్లు అదే హాస్పిటల్ ఫార్మసీలో కొనుక్కోవాలి
బయట చేసే టెస్టు పనికిరాదు
రాసే ట్యాబ్లెట్లు బయట దొరకవు
టెస్టుల దగ్గరి నుంచి ట్యాబ్లెట్ల దాకా..
ట్రీట్మెంట్ నుంచి ఆపరేషన్ల దాకా.. అన్నింటా అడ్డగోలు దోపిడీయే
అదుపు తప్పిన వైద్య సేవలే
ఇదీ కార్పొరేట్ ‘వ్యాపార వైద్యం’!
జేబుకు చిల్లు పెట్టే మాయామంత్రం!!
న్యూఢిల్లీ: రోగం వచ్చిందని దవాఖానకు వెళ్తే కన్సల్టేషన్ ఫీజు, వైద్య పరీక్షలు, ట్యాబ్లెట్లు, ట్రీట్మెంట్, ఆపరేషన్, బెడ్ చార్జీలు.. అని నాలుగైదు పేజీల లిస్టు చేతిలో పెట్టి కార్పొరేట్ దవాఖానలు రూ.లక్షలు దోచేస్తున్నాయి. అందులోనూ హాస్పిటల్ చైన్స్ ఏర్పాటు చేసుకొన్న కొన్ని దవాఖానలు పరిమితికి మించి అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నాయని తేలింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 2015-19 మధ్య నాలుగేండ్ల పాటు పలు దవాఖానల్లో విపరీత వసూళ్లపై తొలిసారి దర్యాప్తు చేపట్టింది. ఆ దర్యాప్తులో దవాఖానలు కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని గుర్తించింది. ఆ హాస్పిటళ్లలో గదుల అద్దె, మందులు, వైద్య పరీక్షలు, వైద్య పరికరాలు, ఇతర వినియోగ వస్తువులపై బయటి కన్నా ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నట్టు తేల్చింది. కొన్ని దవాఖానలు బెడ్ చార్జీలు 4 స్టార్ హోటల్లో ఉండే అద్దె కంటే ఎక్కువగా గుంజుతున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. దీనికి సంబంధించిన నివేదికను సీసీఐకి సంస్థ డైరెక్టర్ జనరల్ 2021 డిసెంబర్లోనే సమర్పించారు. ఈ ఏడాది జూలైలో సంబంధిత దవాఖానలకు సీసీఐ దర్యాప్తు కాపీలను పంపింది.
దర్యాప్తునకు దవాఖానల ఎంపిక ఇలా..
దవాఖానల్లో ఉన్న వైద్యులు, పారామెడికల్ బృందాలు, బెడ్లు, 2015-18 మధ్య టర్నోవర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. ఢిలీ, చుట్టుపక్కల 12 దవాఖానలపై దర్యాప్తు చేపట్టగా, అందులో మ్యాక్స్కు చెందినవి ఆరు, ఫోర్టిస్వి రెండు హాస్పిటల్స్ ఉన్నాయి.
బయటి మందులు పనికిరావు!
ఈ దవాఖానల్లో చేరే రోగులు కచ్చితంగా దవాఖానలోని ఫార్మసీ, ల్యాబ్నే ఉపయోగించుకోవాలి. బయటి మందులను అనుమతించరు. ఫీజులైనా తక్కువున్నాయా? అంటే అదీ లేదు. ఎక్స్రే, ఎమ్మారై, అల్ట్రాసౌండ్ స్కాన్ మెడికల్ టెస్టుల రేట్లు బయటి డయాగ్నస్టిక్ సెంటర్లతో పోల్చితే అధికంగా ఉన్నాయి. సిరంజీ, సర్జికల్ బ్లేడ్ల ధరలు కూడా ఎక్కువే. మందులు మాత్రమే రిటైల్ ధరకు దొరుకుతున్నాయి. తక్కువ ధరకే సేకరించటం వల్ల అందులోనూ దవాఖానలు మంచి లాభాన్నే పొందుతున్నాయి.
టర్నోవర్లో 10 శాతం జరిమానా?
అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్న దవాఖానలకు జరిమానా విధించేందుకు సీసీఐ సిద్ధమవుతున్నది. అధిక ఫీజులు తీసుకోవటంపై దవాఖానల యాజమాన్యాలు ఇచ్చే వివరణను బట్టి నిర్ణయం తీసుకోనున్నది. నిబంధనలు అతిక్రమించే హాస్పిటళ్ల గత మూడు ఆర్థిక సంవత్సరాల టర్నోవర్ సగటును లెక్కించి అందులో 10 శాతం వరకు పెనాల్టీ విధించే అధికారం సీసీఐకి ఉన్నది. అపోలో హాస్పిటల్ టర్నోవర్ రూ.12,206 కోట్లు, ఫోర్టిస్ టర్నోవర్ రూ.4,834 కోట్లుగా ఉన్నది.