న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ధర్నా సందర్భంగా 10, 12వ తరగతి వార్షిక పరీక్షలు వాయిదా పడ్డాయన్న వార్తలు నకిలీవని సీబీఎస్ఈ శుక్రవారం స్పష్టం చేసింది. వదంతులను నమ్మొద్దని విద్యార్థులకు సూచించింది. రైతుల ధర్నా సందర్భంగా ఢిల్లీలో పరీక్ష రాసే విద్యార్థులకు ట్రాఫిక్ మార్గదర్శకాలు మాత్రమే జారీ చేశామని వెల్లడించింది. పరీక్ష కేంద్రాలకు చేరుకోడానికి మెట్రో రైళ్లను ఉపయోగించుకోవాలని సూచించింది.
ఇళ్లలో త్వరగా బయలుదేరాలని.. దీని వల్ల రోడ్లు బ్లాక్ అయినా సరైన సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చని చెప్పింది. సీబీఎస్ఈకి సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం కోసమైనా తమ అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలని విద్యా సంస్థలకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు సూచించింది. ఈ నెల 14న 10, 12వ తరగతుల వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి.