ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్లో ఆమ్ఆద్మీ పార్టీ అంతకంతకూ బలపడుతున్న నేపథ్యంలో.. ఆ పార్టీ కీలక నాయకుడు, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ శుక్రవారం సోదాలు చేపట్టింది. కేజ్రీవాల్ ప్రభుత్వం 2021-22లో తీసుకొచ్చిన నూతన ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై నమోదు చేసిన కేసులో ఢిల్లీలోని సిసోడియా నివాసంతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లోని 21 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఆప్ కీలక నాయకుడు, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ శుక్రవారం సోదాలు చేపట్టింది. కేజ్రీవాల్ ప్రభుత్వం 2021-22లో తీసుకొచ్చిన నూతన ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై నమోదు చేసిన కేసులో ఢిల్లీలోని సిసోడియా నివాసంతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లోని 21 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. సుమారు 14 గంటలపాటు సోదాలు కొనసాగాయి. తన కంప్యూటర్, ఫోన్ను సీజ్ చేశారని సిసోడియా తెలిపారు. సీబీఐని కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఈ కేసులో దర్యాప్తు చేపట్టే అవకాశాలున్నాయి.
ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాశాఖ మంత్రి
సీబీఐ సోదాలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. తాము చేస్తున్న మంచి పనులకు కేంద్రం ఇస్తున్న బహుమానం ఇది అంటూ దుయ్యబట్టారు. ‘సీబీఐకి స్వాగతం. మేము పూర్తిగా సహకరిస్తాం. సిసోడియా నివాసంలో సోదాలు ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ చాలాసార్లు సోదాలు జరిగాయి, ఏమీ కనుక్కోలేకపోయారు. ఇప్పుడూ అంతే’ అని పేర్కొన్నారు. ఢిల్లీ విద్యా విధానాన్ని కొనియాడుతూ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో మొదటి పేజీలో కథనం రావటంతో కేంద్రంలోని బీజేపీ సర్కారు సీబీఐని సిసోడియా ఇంటిపై దాడి చేయాలని ఆదేశించిందని మండిపడ్డారు. సిసోడియా ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాశాఖ మంత్రి అని కొనియాడారు.
దొరికేది నాలుగు పెన్సిళ్లు, నోట్బుక్సే
ఆప్ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఢిల్లీ మోడల్ మొహల్లా క్లినిక్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రిని మోదీ సర్కార్ ఈడీ చేత జైలుకు పంపించిందని, ఇప్పుడు సిసోడియాను కూడా జైలుకు పంపేందుకు కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు. సిసోడియా నివాసంలో సీబీఐ అధికారులకు నాలుగు పెన్సిళ్లు, కొన్ని నోట్బుక్స్, ఒక జామెట్రీ బాక్స్ మాత్రమే దొరుకుతాయని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు.
నా కృషిని ఎవరూ ఆపలేరు
సీబీఐ సోదాలపై సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీబీఐ దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానని, విద్యారంగంలో తాను చేస్తున్న కృషిని ఎవరూ అడ్డుకోలేరని, నిజం ఎప్పటికైనా బయటికి వస్తుందని స్పష్టం చేశారు. దేశం కోసం మంచి పనులు చేస్తున్న వారిని ఇలా వేధించడం దురదృష్టమన్నారు.
ఎఫ్ఐఆర్లో సీబీఐ ఆరోపణలు
నూతన ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ బుధవారం ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో కీలక ఆరోపణలు చేసింది. ఓ లిక్కర్ వ్యాపారి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహచరుడికి రూ.1 కోటి ముడుపులు అందజేశాడని పేర్కొన్నది. ఈ నెల 17న నమోదైన ఈ ఎఫ్ఐఆర్లో 15 మందిని నిందితులుగా చేర్చింది. వారిలో ఏ1గా సిసోడియా పేరు చేర్చింది. జాబితాలో ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ, డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ఆనంద్ కుమార్ తివారీ తదితరుల పేర్లు ఉన్నాయి.
హైదరాబాద్లోనూ సోదాలు
ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్లోనూ సీబీఐ తనిఖీలు నిర్వహించింది. కోకాపేటలోని వ్యాపారి అరుణ్ రామచంద్రపిైళ్లె నివాసంలో సోదాలు జరిపింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దినేశ్ అరోరాతో పిైళ్లెకి సంబంధాలు ఉన్నట్టు సీబీఐ ఆరోపిస్తున్నది.
ఏమిటీ కేసు?
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో నూతన ఎక్సైజ్ విధానాన్ని తీసుకువచ్చింది. దీన్ని ఈ ఏడాది జూలైలో రద్దు చేసింది. అయితే ఈ విధానంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. కొత్త మద్యం విధానం పలు రూల్స్ ఉల్లంఘించేలా ఉన్నదని, విధాన లోపాలు ఉన్నట్టు ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జూలైలో నివేదిక ఇచ్చారు. టెండర్లు కేటాయించిన తర్వాత లిక్కర్ లైసెన్స్దారులకు అనుచిత ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ద్వారా ఖజానాకు నష్టం కలిగిందని రిపోర్టు పేర్కొన్నది. కొవిడ్ పేరుతో లైసెన్స్దారులకు టెండర్ ఫీజులపై ఎక్సైజ్ శాఖ రూ.144.36 కోట్లు మాఫీ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గతనెలలో సీబీఐకి సిఫారసు చేశారు.