పాట్నా: బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి(Rabri Devi) ఇంట్లో ఇవాళ సీబీఐ(CBI) అధికారులు విచారణ చేపడుతున్నారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్(Land for jobs scam)లో ఆమెను ప్రశ్నిస్తున్నారు. రబ్రీ దేవి భర్త .. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వేశాఖ మంత్రిగా ఉన్న సమయంలో .. 2004 నుంచి 2009 మధ్య రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చేందుకు తక్కువ ధరకే భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుతో లింకు ఉన్న రబ్రీ దేవిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. రబ్రీ దేవి వద్ద కేవలం వాంగ్మూలాన్ని(statement) మాత్రమే సేకరిస్తున్నామని సీబీఐ అధికార వర్గాల ద్వారా వెల్లడైంది. తామేమీ దాడులు కానీ, సోదాలు కానీ చేయడం లేదన్నారు. రబ్రీ దేవి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతే.. ఆమె ఇంటికి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ కేసులో ఇటీవల ఢిల్లీ హైకోర్టు రబ్రీ దేవికి సమన్లు జారీ చేసింది. ఆమెతో పాటు భర్త లాలూ, మరో 14 మందికి కూడా ఈ కేసులో సమన్లు జారీ అయ్యాయి. గత ఏడాది అక్టోబర్లో రబ్రీ దేవి, లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు ఇతరులపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. లాలూ కూతురు మీసా భారతి, రైల్వేస్ మాజీ జనరల్ మేనేజర్ పేర్లు కూడా సీబీఐ ఛార్జిషీట్లో ఉన్నాయి. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో ఇప్పటికే భోలా యాదవ్(Bhola Yadav)ను సీబీఐ అరెస్టు చేసింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఓఎస్డీగా పనిచేశారు.