న్యూఢిల్లీ, డిసెంబర్ 11: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి మరిన్ని అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. రాష్ర్టాల సమ్మతి (జనరల్ కన్సెంట్) అవసరం లేకుండానే దర్యాప్తు చేపట్టేందుకు వీలు కల్పించాలని తెలిపింది. కొన్ని రాష్ర్టాలు సీబీఐకి జనరల్ కన్సెంట్ను విరమించుకుంటున్నాయని, దీని వల్ల కొన్ని కీలక కేసులను దర్యాప్తు చేసే అవకాశం లేకుండా పోతున్నదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సీబీఐ కోసం కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే సమయంలో రాష్ర్టాలపై సీబీఐ వివక్ష చూపకుండా ఉండేలా కొన్ని రక్షణ చర్యలు ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. పార్లమెంటరీ ప్యానెల్ వివరాల ప్రకారం.. దేశంలోని 9 రాష్ర్టాలు సీబీఐకి జనరల్ కన్సెంట్ను విరమించుకున్నాయి.