దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో కొందరు మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అదేదో సినిమాలో చూపించినట్లు.. అభ్యర్థి బదులుగా వేరేవాళ్లు పరీక్షలు రాయడానికి వెళ్లాడు. ఇదంతా వాళ్లు పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది.
ఆదివారం జరిగిన ఈ పరీక్షలను అభ్యర్థుల బదులు రాసేందుకు వారి నుంచి భారీగా ఫీజు వసూలు చేసినట్లు సమాచారం. అభ్యర్థుల యూజర్ ఐడీలు, పాస్వర్డులు తీసుకున్న సదరు రిగ్గింగ్ రాకెట్ సభ్యులు.. తమకు కావలసిన ఎగ్జామినేషన్ సెంటర్లు వచ్చేలా దరఖాస్తుల్లో మార్పులు చేశారు.
అసలు విద్యార్థి స్థానంలో వేరొకరు పరీక్ష రాసేందుకు అనువుగా ఫొటోల్లో మిక్సింగ్, మార్ఫింగ్తో మార్పులు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన సీబీఐ.. ప్రస్తుతానికి 8 మందిని అదుపులోకి తీసుకుంది. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఇలా కొందరు మోసం చేస్తున్నట్లు సీబీఐకి ముందుగానే సమాచారం అందింది. అయితే నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు వాళ్లు ఢిల్లీలోని పరీక్ష హాలు ముందే వెయిట్ చేశారు. పరీక్ష ముగిసిన తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ అభ్యర్థులతోపాటు ఈ ప్లాన్ మొత్తం వేసిన మాస్టర్మైండ్ సుశీల్ రంజన్ను కూడా అధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.