చెన్నై : అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో తమిళనాడుకు చెందిన సీబీ సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జూలై 11న చైన్నైకి సమీపంలో ఉన్న వానగరంలో అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా.. మాజీ ముఖ్యమంత్రులు ఓ పన్నీర్ సెల్వం, ఎడప్పాడి కే పళనిస్వామి వర్గీయుల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
పన్నీర్ సెల్వం, ఆయన వర్గీయులు ప్రధాన కార్యాలయంలో దోపిడీకి పడ్డారనే పార్టీ నేత సీవీ షణ్ముగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. డీఎస్పీ వెంకటేశ్వరన్ ఆధ్వర్యంలో కార్యాలయంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి సీబీ సీఐడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. రెవెన్యూ అధికారులు ఆస్తిని సీల్ చేశారంటూ షణ్ముగం ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తున్నది.