చెన్నై, ఆగస్టు 24: అర్హత పొందిన అన్ని కులాల వారూ అర్చకులు కావచ్చునని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆగమశాస్త్ర నియమం కూడా ఇదే చెబుతుందని వ్యాఖ్యానించింది. సేలం సగవనేశ్వరర్ స్వామి ఆలయంలో అర్చకుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ 2018 జనవరిలో నిర్వాహకులు ఒక ప్రకటన ఇచ్చారు. అయితే ఆలయ నిర్వాహకులు ఇచ్చిన నోటిఫికేషన్ ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా లేదని ముత్తు సుబ్రమణియ గురుకల్ అనే అర్చకుడు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిని జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ విచారించారు. ఆలయ ఆగమ నియమాలు, పూజా విధానాల్లో ఉత్తీర్ణత పొందిన వారెవరైనా అర్చకులు కావొచ్చునని ఆయన తీర్పు చెప్పారు. ఈ తీర్పునే మద్రాస్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కూడా సమర్థించింది. దీనిపై సుబ్రమణియ సుప్రీంకోర్టులో కేసు వేయడంతో తాజాగా ధర్మాసనం విచారణ జరిపింది. అన్ని కులాల వారూ అర్చకులు కావచ్చన్న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టేకు నిరాకరించింది. ఆగమ నియమాల ప్రకారం ఉత్తీర్ణత పొంది తగిన శిక్షణ, పూజ చేయడానికి అర్హత పొందిన వారు ఎవరైనా అర్చకులు కావచ్చునని పేర్కొంటూ సుబ్రమణియ పిటిషన్ను కొట్టివేసింది.