MP Dhiraj Sahu | ఢిల్లీ/భువనేశ్వర్, డిసెంబర్ 10: కట్టల కట్టల డబ్బు.. లెక్కపెట్టలేక మొరాయించిన కౌంటింగ్ మెషీన్లు.. ఒడిశాలోని మద్యం డిస్టిలరీలపై ఆదాయపు పన్ను శాఖ దాడుల సందర్భంగా అధికారులకు ఎదురైన అనుభవమిది. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ, ఆయన బంధువులకు చెందిన మద్యం వ్యాపార సంస్థలపై జరిగిన ఈ దాడుల్లో నగదు కట్టలు కట్టలు బయటపడ్డాయి.
మొత్తం పట్టుబడ్డ నగదు 351 కోట్ల రూపాయలని అధికారులు ప్రకటించారు. ఐటీయే కాదు, ఏ ఇతర దర్యాప్తు సంస్థలు కూడా ఏకదాడిలో ఇంత పెద్దమొత్తంలో అక్రమ సొమ్మును స్వాధీనం చేసుకోవడం దేశంలో ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు.
రికార్డు స్థాయిలో..
గతంలో 2019లో కాన్పూర్ కేంద్రంగా ఉన్న ఒక వ్యాపార సంస్థపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు దాడి చేసి 257 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు దేశంలో అదే పెద్ద మొత్తం. అలాగే తమిళనాడులో ఒక నిర్మాణ సంస్థపై ఐటీ అధికారులు 2018లో దాడి చేసి రూ.153 కోట్లను పట్టుకున్నారు. ఈ రికార్డులన్నీ ఒడిశా ఐటీ దాడితో తుడిచిపెట్టుకుపోయాయి.
కాగా ఈ నెల 6న ప్రారంభమైన ఐటీ దాడులు ప్రధానంగా బల్దేయో సాహు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు అనుబంధంగా ఉన్న బౌద్ధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ (బీడీపీఎల్)పై కొనసాగాయి. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూకు చెందిన రాంచి, ఇతర ప్రదేశాల్లోని సంస్థలపై కూడా దాడులు జరిగాయి. అయితే వాటి నుంచి ఎంత నగదు, ఏం పత్రాలు స్వాధీనం చేసుకున్నారో ఐటీ అధికారులు ఇంకా వెల్లడించ లేదు.
రాహుల్ నోరు విప్పరేం?
దేశీయ మద్యం అమ్మకాల ద్వారానే లెక్కల్లో చూపని ఇంత మొత్తాన్ని బిజినెస్ గ్రూప్, డిస్ట్రిబ్యూటర్లు, ఇతరులు ఆర్జించినట్టు అధికారులు తెలిపారు. కాగా, కాంగ్రెస్ ఎంపీ వ్యాపార ప్రాంగణాలపై ఐటీ దాడుల ద్వారా రూ.వందల కోట్ల అక్రమ సొమ్ము బయటపడుతున్నా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు నోరు మెదపడం లేదని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ఆదివారం ప్రశ్నించారు. దాడులపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందిస్తూ కేంద్రం ఒక్క కాంగ్రెస్ నేతలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నదని, బీజేపీ వారి జోలికి ఎందుకు వెళ్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్లధనంపై ధీరజ్ పాత ట్వీట్ వైరల్
ధీరజ్ సాహూ సంస్థల్లో పెద్దయెత్తున నల్లధనం పట్టుబడిన క్రమంలో ఆయన గత ఏడాది ఆగస్టు 12న నల్లధనంపై చేసిన ట్వీట్ వైరల్గా మారింది. బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్లో ఆ పాత పోస్ట్ను ఉంచారు. ‘పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా ఇంత పెద్ద యెత్తున నల్లధనం, అవినీతి చూస్తే నాకు బాధేస్తున్నది. అసలు ఇంత పెద్ద మొత్తంలో నల్లధనాన్ని ఎందుకు పోగేసుకుంటున్నారో నా మస్తిష్కానికి అందడం లేదు. ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఈ అవినీతిని కూకటి వేళ్లతో పెకిళించగలదు’ అని ఎంపీ ధీరజ్ సాహూ గతంలో ట్వీట్ చేశారు.