(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో ఊరట లభించింది. సోలార్ కాంట్రాక్టుల కేసులో గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై మోపిన క్రిమినల్, సివిల్ ఫ్రాడ్ అభియోగాలను ఉపసంహరించుకొన్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్తో పాటు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) కేసులను వెనక్కి తీసుకొన్నట్టు ప్రకటించాయి. అమెరికాలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, అయితే కోర్టులో కేసుల కారణంగా దీనికి ముందడుగు పడటం లేదని గత నెలలో అదానీ న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం అదానీపై కేసుల విషయంలో వెనక్కి తగ్గడం గమనార్హం. కాగా ఈ స్కామ్లో అదానీకి నోటీసులు జారీచేయడానికి తమకు సాయం చేయడంలేదంటూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఎస్ఈసీ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఏమిటీ కేసు?
తమ సౌర విద్యుత్తు ప్రాజెక్టులను ఆమోదించేందుకు గౌతమ్ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్ సంస్థల ఎగ్జిక్యూటివ్లు భారత్లోని వివిధ రాష్ర్టాల ఉన్నతాధికారులకు 265 మిలియన్ డాలర్లు (రూ. 2,567 కోట్లు) ముడుపులు ఇవ్వజూపారని ఆరోపణలు వచ్చాయి. రానున్న 20 ఏండ్లలో రూ. 20 వేల కోట్లు లాభాలు గడించాలన్న లక్ష్యంతో ఈ లంచాలకు తెరతీసినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయమై అదానీపై యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎస్ఈసీ వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి.