లక్నో: వివాదాస్పద రీతిలో భూ ఆక్రమణకు పాల్పడినట్లు ఇటీవల అయోధ్య రామాలయ ట్రస్టు సెక్రటరీ చంపత్ రాయ్పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో స్థానిక పోలీసులు ఓ జర్నలిస్టును అరెస్టు చేశారు. అతనితో పాటు మరో ఇద్దరిపై 18 అభియోగాలను నమోదు చేశారు. చంపత్ రాయ్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భూ ఆక్రమణ కేసులో చంపత్ రాయ్, అతని సోదరులకు బిజ్నోర్ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ ఈ కేసులో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్పారు. జర్నలిస్టు వినీత్ నారాయన్తో పాటు అల్కా లోహిత్, రజినీష్ పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఈ ముగ్గురు నిందితులు చంపత్ రాయ్పై తప్పుడు ఆరోపణలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బిజ్నోర్లోని తన స్వంత పట్టణంలో చంపత్ తన సోదరులతో కలిసి భూ దందాకు పాల్పడుతున్నట్లు జర్నలిస్టు వినీత్ నారాయన్ తన ఫేస్బుక్ లో ఓ పోస్టు చేశారు. ఎన్ఆర్ఐ అల్కా లహోటికి చెందిన 20 వేల చదరపు మీటర్ల భూమిని చంపత్ రాయ్ ఆక్రమించినట్లు తన పోస్టులో ఆరోపించాడు.