న్యూఢిల్లీ : బీజేపీ నేత, ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయపై బెంగళూర్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi )చేసిన ట్వీట్కు సంబంధించి మాలవీయపై కేసు నమోదైంది. రాహుల్ గాంధీ ప్రమాదకరమైని, ఆయన కృత్రిమ గేమ్ ఆడుతున్నారని మాలవీయ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ఫిర్యాదు ఆధారంగా మాలవీయపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా అమిత్ మాలవీయపై ఎఫ్ఐఆర్ నమోదు రాజకీయ దురుద్దేశంతో జరిగిందని ఎంపీ, బీజేపీ నేత తేజస్వి సూర్య ఆరోపించారు. మాలవీయపై ఐపీసీ 153ఏ, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, ఈ రెండు సెక్షన్లు వివిధ గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించే వారిపై నమోదు చేస్తారని, అయితే రాహుల్ గాంధీ ఓ వ్యక్తి అని గ్రూపు లేదా ఓ వర్గమా..? అని ప్రశ్నించారు.
అమిత్ మాలవీయపై కేసు నమోదును తాము కోర్టులో సవాల్ చేసి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. కాగా చట్టాన్ని ఎదుర్కోవాల్సిన సందర్భంలో బీజేపీకి కేకలు వేయడం అలవాటుగా మారిందని కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. దేశ చట్టాలను అనుసరించడం వారికి సమస్యగా మారిందని ఎద్దేవా చేశారు. అమిత్ మాలవీయపై ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేవని, న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైందని స్పష్టం చేశారు.
Read More :