జైపూర్ : అజ్మీర్ షరీఫ్ దర్గా వద్ద మహిళ డ్యాన్స్ చేస్తున్న వీడియో (Viral Video) వివాదాస్పదమైంది. ఈ వీడియో వైరల్ కావడంతో సదరు మహిళ ప్రార్ధనా స్ధలం పవిత్రతను కాపాడలేదని పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి. మహిళ తీరును మసీదు నిర్వాహకులు తప్పుపట్టారు. వైరల్ వీడియోలో గ్రే, పింక్ కుర్తా దుపట్టా ధరించిన మహిళ ఇయర్ఫోన్స్లో మ్యూజిక్ను ఆస్వాదిస్తూ డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది.
ప్రార్ధనా స్ధలం అనే ధ్యాస కూడా లేకుండా బీట్స్కు అనుగుణంగా మహిళ రాజస్ధాన్లోని తారాఘడ్ హిల్ పాదాల చెంత కొలువైన ప్రముఖ దర్గాలో డ్యాన్స్ చేయడం వివాదానికి కేంద్ర బిందువైంది. 13వ శతాబ్ధపు సూఫీ బోధకుడు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాకు వచ్చిన సహచర సందర్శకుడు ఈ క్లిప్ను రికార్డు చేసినట్టు సమాచారం. ఇది పవిత్ర ప్రదేశమని ఆ మహిళ తెలుసుకోవాలని దర్గా నిర్వాహకులు పేర్కొన్నారు.
దేశంలోని ప్రముఖ పవిత్ర స్ధలాల్లో ఒకటైన అజ్మీర్ దర్గాను దేశవ్యాప్తంగా వివిధ మతాలకు చెందిన వారు పెద్దసంఖ్యలో సందర్శిస్తుంటారు. కాగా గత ఏడాది మసీదు ప్రాంగణంలో ఓ బాలిక జిమ్నాస్ట్ విన్యాసాలు కూడా వైరల్ అయ్యాయి. ఆపై బాలిక క్షమాపణలు కోరింది. ఇక గత ఏడాది అక్టోబర్లో ఉజ్జయినిలోని మహాకాళీ ఆలయంలో కొందరు ఇన్స్టాగ్రామర్లు డ్యాన్స్ వీడియోలు రికార్డు చేయడం కలకలం రేపింది. ఇన్స్టాగ్రామర్ల డ్యాన్స్ వీడియోలపై ఆలయ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More :
Iron Pillar | రద్దీ రోడ్డుపై కూలిన ఐరన్ పిల్లర్.. తప్పిన పెను ప్రమాదం