బెంగళూరు, ఫిబ్రవరి 16: అధిక రెజల్యూషన్ గల ఫొటోలు తీసే ఇస్రో రెండో తరంలోని మొదటి ఉపగ్రహమైన కార్టోశాట్-2ను శుక్రవారం విజయవంతంగా భూ వాతావరణంలోకి తీసుకొచ్చినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఉపగ్రహం 17 ఏండ్ల పాటు సేవలందించింది. ‘సాయత్రం 3.48కి హిందూ మహా సముద్రం మీదకు ఈ ఉపగ్రహాన్ని తీసుకొచ్చాం. దీన్ని దహనం చేస్తాం లేదా సముద్రంలో పడిపోయేలా వదిలేస్తాం’ అని ఇస్రో అధికారి ఒకరు తెలిపారు. కార్టోశాట్ గమనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు ఇస్రో తెలిపింది.
ఈ శాటిలైట్ భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు దాని అన్ని ప్రధాన భాగాలు విచ్ఛిన్నమైపోతాయని వెల్లడించింది. 2007లో ప్రయోగించిన ఈ శాటిలైట్ 2019 వరకు పట్ణణ ప్రణాళిక కోసం హై రెజల్యూషన్ కలిగిన ఫొటోలు తీసి పంపింది. అంతర్జాతీయ అంతరిక్ష మార్గదర్శకాల ప్రకారం దీన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నట్టు ఇస్రో చెప్పింది. సహజంగా కార్టోశాట్-2 తన కక్ష్య నుంచి విడిపోవడానికి 30 ఏండ్లు పడుతుందని భావించారు.