న్యూఢిల్లీ, జూన్ 28: న్యాయపరంగా తమకు దక్కాల్సిన ఉద్యోగాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 500 రోజులుగా వాళ్లు నిరసనలు చేపడుతున్నారు. వాళ్లంతా పేద, మధ్యతరగతికి చెందిన యువతీ, యువకులు. పల్లెల్లో కూలీనాలీ చేసే తల్లిదండ్రులను డబ్బు అడగలేరు. అందుకే, చేతిలో జాతీయ జెండాను పట్టుకొని కడుపు మాడ్చుకుంటూ ధర్నాకు కూర్చున్నారు. ఎవరైనా అన్నం పెడితే తింటారు. లేకపోతే పస్తులతో పడుకుంటారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల కోసం ఎస్సెస్సీ జీడీ 2018 రిక్రూట్మెంట్లో సెలక్ట్ అయిన దాదాపు 4 వేల మంది అభ్యర్థుల ఆవేదన ఇది. సెలక్ట్ అయినప్పటికీ, రెండేండ్లు గడిచినా కేంద్రహోంశాఖ అపాయింట్మెంట్ లెటర్ అందజేయకపోవడంపై వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నంబర్లు ఎందుకు ప్రచురించారు?
సీఏపీఎఫ్లో దాదాపు 60 వేల పోస్టుల భర్తీకి 2018లో ఎస్సెస్సీ జీడీ పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్షలో ఉత్తీర్ణులైన 4,295 మంది అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వలేదు. దీనిపై అభ్యర్థులు కేంద్రమంత్రులను, స్థానిక రాజకీయ నాయకులను కలిసి మొరపెట్టుకున్నారు. ఉత్తీర్ణత సాధించినప్పటికీ తమను ఎందుకు రిక్రూట్ చేసుకోవడంలేదో చెప్పాలని కేంద్రహోంశాఖకు లేఖ రాశారు. అయితే ఆ శాఖ నుంచి సమాధానం రాలేదు. దీంతో 2020 చివర్లో వందలాది మంది అభ్యర్థులు మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి ఢిల్లీకి కాలినడకన నిరసన ప్రదర్శన నిర్వహించారు. జంతర్మంతర్ దగ్గర ధర్మాకు దిగారు. కోర్టులో కేసు వేశారు. అయితే, పిటిషన్ వేసిన అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత కాలేదని ప్రభుత్వం సమాధానమిచ్చింది. పాస్ కాకుంటే రిజల్ట్స్లో తమ నంబర్లను ఎందుకు ప్రచురించారని అభ్యర్థులు కౌంటర్ ఫైల్ దాఖలు చేశారు. ప్రస్తుతం కేసు నడుస్తున్నది. అయితే, ఇప్పటికే తమ వయసు పరిమితి ముగుస్తున్నదని, వివాదం కారణంగా వేరే ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకొనే పరిస్థితులు లేవని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.
వాళ్లిచ్చే తిండితో బతుకుతున్నాం..
ఇంటికి వెళ్లక దాదాపు 500 రోజులైంది. నేను రోడ్డుపై ఉండగానే హోలీ, దీపావళి పండుగలు వెళ్లిపోయాయి. నాన్న లేరు. అమ్మ పొలంలో కూలీగా పనిచేస్తుంది. డబ్బు పంపాలని ఇంట్లో వాళ్లను అడగలేను. మా చేతిలో ఉన్న జెండాను చూసి ఎవరో ఒకరు తిండి పెడతారు. అలా ఇన్ని రోజులు బతకగలిగాం.
-విశాల్ లాంగ్డే,మహారాష్ట్ర వాసి