న్యూఢిల్లీ: ఒన్ ర్యాంక్ ఒన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) బకాయిల చెల్లింపుపై రక్షణ మంత్రిత్వశాఖకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోరాదంటూ మండిపడింది. ఓఆర్ఓపీ (OROP) బకాయిలను నాలుగు విడతల్లో చెల్లిస్తామంటూ జనవరి 20న జారీ చేసిన ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకోవాలని రక్షణ మంత్రిత్వశాఖను సోమవారం ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు రక్షణ మంత్రిత్వశాఖను మందలించింది.
మాజీ సైనికులకు ఓఆర్ఓపీ బకాయిలను కేంద్రం ఒక విడత చెల్లించిందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలిపారు. మిగతా చెల్లింపుల కోసం మరికొంత సమయం కావాలని కోరారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘జనవరి 20 నోటిఫికేషన్ను ముందు ఉపసంహరించుకోండి. ఆ తర్వాత మీరు కోరిన గడువును పరిశీలిస్తాం’ అని బెంచ్ పేర్కొంది.
కాగా, ఒన్ ర్యాంక్ ఒన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) బకాయిలను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామంటూ ఈ ఏడాది జనవరి 20న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును ఇండియన్ ఎక్స్ సర్వీస్మెన్ మూవ్మెంట్ (ఐఈఎస్ఎం) సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో సాయుధ బలగాలకు చెందిన అర్హులైన పింఛనుదారులకు బకాయిల చెల్లింపులో జాప్యంపై ఫిబ్రవరి 27న సర్వోన్నత న్యాయస్థానం రక్షణ మంత్రిత్వశాఖను నిలదీసింది. పూర్తి బకాయిల చెల్లింపు కోసం మార్చి 15 వరకు గడువు ఇచ్చింది. అయినప్పటికీ బకాయిలను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామంటూ జనవరి 20న నోటీసు జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ ఉత్తర్వును వెంటనే వెనక్కి తీసుకోవాని ఆదేశించింది.