న్యూఢిల్లీ, మార్చి 12: కేంద్రం యథేచ్ఛగా ప్రతిపక్షాలపైకి దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్న న్యాయవాది నితీశ్ రాణా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్టు తెలిపారు. 2015 నుంచి ఈడీ న్యాయవాదిగా ఉన్న నితీశ్ రాణా పలు కీలక కేసుల్లో ఈడీ తరపున వాదనలు వినిపించారు.
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబం, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, కాంగ్రెస్ నేత సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాలపై నమోదైన కేసుల్లో ఈడీ తరపు న్యాయవాదిగా నితీశ్ రాణా పనిచేశారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలపై నమోదైన మనీలాండరింగ్ కేసులు, రాన్బాక్సీ-రెలిగేర్ ఫ్రాడ్తో పాటు స్టెర్లింగ్ బయోటెక్ స్కామ్ వంటి కేసుల్లో కూడా ఈడీకి ప్రాతినిధ్యం వహించారు. పలు టెర్రర్ ఫండింగ్ కేసుల్లో కూడా నితీశ్ రాణా ఈడీ న్యాయవాదిగా పనిచేశారు.