ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు ఇలాగే కొనసాగితే లాక్డౌన్ను తోసిపుచ్చలేమని సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఆ రాష్ట్ర ప్రజలనుద్దేశించి టీవీలో మాట్లాడారు. కరోనాను ప్రజలు చాలా తేలికగా తీసుకుంటున్నారని, చాలా ఆత్మసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు. మనం క్యాచ్ 22వ పరిస్థితిలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించాలా లేక ప్రజల ఆరోగ్యం గురించి ఆందోళన చెందాలో తెలియడం లేదన్నారు.
కరోనా నుంచి ప్రజలు బయటపడేందుకు చాలా మందితో తాను మాట్లాడుతున్నారని ఉద్ధవ్ తెలిపారు. ‘నేను లాక్డౌన్ కోరుకోవడం లేదు. కానీ కరోనాకు పరిష్కారం ఎలా?’ అని ఆయన ప్రశ్నించారు. రెండు రోజుల్లో కఠిన ఆంక్షలకు మార్గదర్శకాలు జారీ చేస్తానని చెప్పారు. అలాగే కరోనా పరీక్షల సంఖ్యను రోజుకు 2.5 లక్షలకు పెంచుతామని తెలిపారు. కరోనా కేసుల పెరుగుదలలో మార్పు రాని పక్షంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించాల్సి వస్తుందని ప్రజలకు ముందస్తు హెచ్చరిక చేశారు.