Hardik Patel on Congress | దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, గౌతం అదానీలపై నిరంతరం విమర్శలతో దాడి చేయడంపై గుజరాత్ పాటిదార్ నాయకుడు హార్ధిక్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన హార్దిక్ పటేల్.. ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. కష్టపడి పని చేయడం వల్లే ఈ పారిశ్రామికవేత్తలు ఎదిగారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ వారైనందు వల్లే వారిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయరాదని గురువారం వ్యాఖ్యానించారు.
ఒక వ్యాపారవేత్త సొంతంగా కష్టపడి పనిచేయడం వల్లే ఎదుగుతాడు. ప్రతిసారీ అంబానీ లేదా అదానీని మీరు దుర్భాషలాడవద్దు. ఇది కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని హార్దిక్ పటేల్ అన్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీలో మూడేండ్లుగా సమయం వృధా చేశానని చెప్పారు. తాను ఏ పార్టీలోనూ లేనని చెప్పారు. గుజరాత్ ప్రగతి కోసం పని చేస్తా అని వ్యాఖ్యానించారు.
నాకు కాంగ్రెస్ పార్టీలో పని చేయడానికి అవకాశం లభించలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యతలు అప్పగించలేదు అని హార్ధిక్ పటేల్ పేర్కొన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడిన హార్ధిక్ పటేల్.. రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
హార్ధిక్ పటేల్ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయన అవకాశ వాద రాజకీయాలు చేస్తున్నారని పేర్కొంది. పాటిదార్లకు రిజర్వేషన్ కోసం జరిగిన ఆందోళన సందర్భంగా నమోదైన కేసులను ఉపసంహరించుకోవడానికి ఆరేండ్లుగా బీజేపీతో సంప్రదిస్తున్నారని ఆరోపించింది. కానీ, బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యానని వచ్చిన ఆరోపణలను హార్దిక్ పటేల్ ఖండించారు. కొన్నేండ్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీలో చేరిపోయారని గుర్తు చేశారు.